బన్సీలాల్పేట్, ఫిబ్రవరి 25 : ఇండియన్ అసోసియేషన్ ఫర్ డెర్మటాలజిస్ట్, వెనిరాలజిస్ట్, లెప్రాలజిస్ట్ (ఐఏడీవీఎల్) 2024-25 ఎన్నికల్లో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రముఖ చిన్నపిల్లల చర్మవ్యాధుల వైద్య నిపుణుడు డాక్టర్ కటకం భూమేశ్కుమార్ ఎన్నికయ్యారు. రెండేండ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.
ప్రస్తుతం సూర్యాపేటలోని ప్రభుత్వ దవాఖానలో చర్మవ్యాధుల విభాగం హెచ్వోడీగా, గాంధీ దవాఖానలో పిడియాట్రిక్ డెర్మటాలజీ ట్రైనింగ్ సెంటర్ డైరెక్టర్గా అయన విధులను నిర్వర్తిస్తున్నారు. ఐఏడీవీఎల్ తెలంగాణ శాఖ ద్వారా ఆయన చర్మవ్యాధుల పట్ల సామాన్య ప్రజలను, కొత్త డాక్టర్లను చైతన్యపరిచే అనేక అవగాహనా శిబిరాలను నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలో జన్మించిన డాక్టర్ భూమేశ్కుమార్ గాంధీ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చదివారు.