నల్లగొండ : మిర్యాలగూడ ప్రాంతీయ దవాఖానను బుధవారం తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్పిటల్లోని అన్ని విభాగాలను పరిశీలించారు. రోగులతో విడివిడిగా మాట్లాడి వారికి అందుతున్న సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. మిర్యాలగూడ ప్రాంతీయ దవాఖానలో 200 పడకలకు సామర్థ్యం పెంచేందుకు కాను అవసరమైన ఏర్పాట్లు ఉన్నాయనే విషయమై పరిశీలించేందుకు వచ్చామన్నారు. ప్రాంతీయ దవాఖానలో ప్రత్యేకంగా ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటుకు అవకాశం ఉందనే విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే భాస్కరరావు మంత్రి హరీశ్ రావు దృష్టికి తీసుకు వచ్చినందున ఆ విషయాన్ని కూడా పరిశీలిస్తున్నామన్నారు.
రోగులకు మెరుగైన సేవలు అందుతున్నాయని భవిష్యత్తులో మరిన్ని సేవలు అందిస్తామని తెలిపారు. ప్రాంతీయ దవాఖానక రెండవ అంతస్తు ఏర్పాటుకు గాను రూ.13 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. డయాలసిస్ రోగుల కోసం నెఫ్రాలజిస్టును ప్రత్యేకంగా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తామని స్పష్టం చేశారు.
ఆయన వెంట డీఎంహెచ్వో మాతృనాయక్ ప్రోగ్రాం ఆఫీసర్ రమేష్, సూపరింటెండెంట్ శ్రీనివాస సమరత్, ఆర్ఎంఓ రాంబాబు తదితరులు ఉన్నారు. అనంతరం వైద్యులకు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి దవాఖానలో సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచాలని ఆదేశించారు.