హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని టెక్నాలజీ కంపెనీలు అంతర్జాతీయంగానూ సత్తా చాటుతున్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సరికొత్త ఆవిష్కరణలు, ప్రాజెక్టుల రూపకల్పనలో ముందడుగు వేస్తున్నాయి. వాటిలో ఐఐసీ టెక్నాలజీస్ (ఐఐసీటీ) లిమిటెడ్ కంపెనీ ఒకటి. అత్యాధునిక లైడార్ టెక్నాలజీతో రోజుకు 500 చదరపు కిలోమీటర్ల భౌగోళిక విస్తీర్ణాన్ని సర్వే చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఈ సంస్థ.. కేవలం రోజున్నర వ్యవధిలోనే గ్రేటర్ హైదరాబాద్ మొత్తాన్ని సర్వే చేసి, నివేదిక ఇవ్వగలమని స్పష్టం చేసింది. అందుకు సంబంధించిన వివరాలను ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతున్న యునైటెడ్ నేషన్స్ వరల్డ్ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్లో తెలియజేసింది. రెండు సొంత విమానాలతోపాటు అత్యంత ఖరీదైన కెమెరాలు, సెన్సార్లు, ఇతర పరికరాలను కలిగి ఉన్న ఈ సంస్థ భౌగోళిక సర్వేలో ఇండస్ట్రీ లీడర్గా కొనసాగుతున్నది. ఇప్పటికే ఈ సంస్థ హైదరాబాద్-ముంబై హైస్పీడ్ రైలు ప్రాజెక్టుపై సర్వే చేపట్టింది. ప్రస్తుతం తమ కంపెనీ వివిధ దేశాల్లో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను నిర్వహిస్తున్నదని, వీటితోపాటు డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడ్రనైజేషన్ ప్రోగ్రామ్, నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు, నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా, ఇంటిగ్రేటెడ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు, మూడు మార్గాల్లో నిర్మించే డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్లను రూపొందించే పనిలో ఉన్నామని ఐఐసీటీ ప్రతినిధులు డాక్టర్ రవికుమార్, ముఖేశ్వర్మ తెలిపారు.