వీర్నపల్లి, అక్టోబర్ 14: ఆ గిరిజన మహిళపై ప్రకృతి పగబట్టింది. రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబానికి చెందిన మహిళ రెండుసార్లు పిడుగుపాటుకు గురైంది. గతేడాది పిడుగుపడి తీవ్రగాయాలు కాగా, శుక్రవారం మరోసారి పిడుగుపడటంతో ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం మద్దిమల్ల లొద్దితండాలో చోటుచేసుకున్నది.
గ్రామానికి చెందిన కొడావత్ లలిత (42) గొర్రెలను మేపేందుకు తన పొలానికి వెళ్లింది. సాయంత్రం భారీ వర్షం కురుస్తుండగా పిడుగుపడటంతో తీవ్ర గాయాలపాలైంది. స్థానికులు గమనించి చికిత్స కోసం ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. కాగా గతేడాది వ్యవసాయ పనులు చేస్తుండగా లలిత పిడుగుపాటుకు గురై తీవ్రగాయాలపాలైంది. శుక్రవారం పిడుగుపడటంతో మృత్యువు నుంచి తప్పించుకోలేకపోయింది. ఈ ఘటనతో స్థానికులతోపాటు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. లలితకు భర్త శంకర్, ముగ్గురు కూతుర్లు, ఓ కుమారుడు ఉన్నారు.