కేంద్రపారా: ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలో ఓ మహిళ అవిభక్త కవలలకు జన్మనిచ్చింది. ఆ ఇద్దరూ అమ్మాయిలే. శరీరాలు కలిసి పుట్టిన ఆ చిన్నారులకు రెండు తలలు ఉన్నాయి. రెండు కాళ్లు, మూడు చేతులతో ఆ కవలలు జన్మించారు. చిన్నారుల ఆరోగ్యం క్షీణించడంతో వారిని కటక్లోని శిశూ భవన్కు తరలించారు. ఆదివారం రోజున ప్రైవేటు నర్సింగ్ హోమ్లో ఆ కవలలు జన్మించారు. వైద్య పరిభాషలో వారిని సియామిసీ ట్విన్స్గా పిలుస్తారు. ఇదో అరుదైన జననం. పుట్టిన తర్వాత పిల్లల ఆరోగ్యం క్షీణించినా.. ప్రస్తుతం వారు క్షేమంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. చిన్నారుల ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ తీసిన తర్వాత వారి లోపాల గురించి పూర్తి వివరాలు తెలుస్తాయని డాక్టర్ దేబశిశ్ సాహూ తెలిపారు. సిజేరియన్ ద్వారా పిల్లలు జన్మించారు. కని గ్రామానికి చెందిన అంబికా, ఉమాకాంత్ పరిదా తల్లితండ్రులు. కవల పిల్లల చికిత్స కోసం ప్రభుత్వం సాయం చేయాలని తండ్రి అభ్యర్థించాడు. 2017లో ఒడిశాకు చెందిన ట్విన్స్ జాగా, కాలియాలను ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యలు విజయవంతంగా విడదీశారు. ఆ ఆపరేషన్ ఖర్చును ఒడిశా ప్రభుత్వం భరించింది.