మంగళవారం 07 జూలై 2020
Telangana - Jul 05, 2020 , 02:20:30

ఊరే.. ఆశాదీపం

ఊరే.. ఆశాదీపం

  • సంపద కేంద్రాలుగా పల్లెలు
  • సాగు విప్లవంతో మారిన చిత్రం
  • సాగు యంత్రాల కొనుగోళ్లు రెట్టింపు
  • ద్విచక్ర వాహనాలకూ మంచి గిరాకీ
  • ఆర్థిక వ్యవస్థకు పల్లెతల్లి కొత్త జీవం

పంటల కొనుగోళ్లు, ప్రభుత్వ పథకాల రూపంలో గత నాలుగైదు నెలల్లో పల్లెల్లోకి దాదాపు 62 వేల కోట్ల రూపాయలు నగదు ప్రవహించింది. 2019 జనవరి నుంచి జూన్‌ వరకు అంటే ఆరునెలల్లో 13,736 వాహన రిజిస్ట్రేషన్లు జరగ్గా కరోనా సంక్షోభం ఉన్నప్పటికీ 2020 మే 7 నుంచి జూన్‌ 30 వరకు 10,333 ట్రాక్టర్లు, వరికోత యంత్రాల రిజిస్ట్రేషన్లు అయ్యాయి.1970 తర్వాత తొలిసారి ఇప్పుడు పట్టణాల నుంచి గ్రామాలకు రివర్స్‌ వలసలు సాగుతున్నాయి. పల్లెల్లో నగదు ప్రవాహం 30 నుంచి 40శాతం వరకు పెరిగింది. 

-అనిల్‌రెడ్డి, ఎఫ్‌టీసీసీఐ మాజీ అధ్యక్షుడు

లోకమంతా కరోనాతో కకావికలమవుతుంటే.. తెలంగాణ పల్లెలు కాసులతో కళకళలాడుతున్నాయి. ఒకప్పుడు ఉపాధికోసం పట్నాలు వలసకేంద్రాలుగా మారితే.. ఇప్పుడు ఊరే ఆశాదీపంగా కనిపిస్తున్నది. మన ఊళ్లో మనం హాయిగా బతుకొచ్చనే భరోసా లభిస్తున్నది. దశాబ్దాల తర్వాత ఊహించని విధంగా వ్యవసాయం పండుగలా మారడంతో పల్లెల్లో జనాభా 30 శాతం పెరిగింది. సాగునీరు పుష్కలంగా లభించడం.. పండిన పంట ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వమే కొని డబ్బులు చెల్లించడంతో తెలంగాణ పల్లెల్లోని ప్రతి గడపలో సిరులు కురిశాయి. రైతు కుటుంబాల కొనుగోలుశక్తి పెరిగింది. వివిధ రకాల వాహనాల కొనుగోళ్లూ పెరిగాయి. పట్నంలో అన్ని రంగాలు కుదేలయితే.. మొట్టమొదటిసారి రైతు ఆనందంగా కనిపిస్తున్నాడు. దీంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మన పల్లెసీమలు పట్టుగొమ్మలుగా మారుతున్నాయి. ఇంతకాలం తర్వాత పారిశ్రామిక రంగం చూపు వ్యవసాయంవైపు మళ్లింది. 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించిన నాటినుంచి పల్లెలు కళకళలాడటం మొదలైంది. వ్యవసాయానికి ప్రభుత్వం అందించిన ప్రోత్సాహంతో పంటకోతలు, నూర్పిళ్లు, ఆ తర్వాత అమ్మకాలు ఇలా నిత్యం సందడిగా మారాయి. రైతులు పంటలు పండించడానికి పెట్టుబడితోపాటు, దిగుబడిని కూడా ప్రభుత్వమే కొనడంతో రైతుల్లో ఉత్సాహం ద్విగుణీకృతమైంది. రాష్ట్రంలో పంటల అమ్మకాల ద్వారా రూ.50 వేల కోట్లు పల్లెలకు చేరినట్లు అంచనా. ఒకవైపు అన్ని రంగాలు కునారిల్లిపోతే.. వ్యవసాయం మాత్రం సస్యశ్యామలమైంది. వచ్చిన సంపద కూడా వృథాగా పోవడంలేదు. రైతులు వ్యవసాయ సంబంధమైన యంత్రాల కొనుగోలువైపు దృష్టిసారించారు. దీంతో ట్రాక్టర్లు, వరికోత యంత్రాల అమ్మకాలు రెట్టింపయ్యాయి. 

30 శాతం పెరిగిన పల్లె జనాభా

లాక్‌డౌన్‌ నేపథ్యంలో పట్టణాల్లో ఉపాధి కోల్పోయిన జనం పెద్ద సంఖ్యలో సొంత ఊళ్లకు చేరుకొన్నారు. గత మూడునెలల కాలంలో గ్రామీణ జనాభా 30 శాతం పెరిగినట్టు అంచనా. రాష్ట్రంలోని ఒక ప్రధాన పత్రికలోని యంత్ర విభాగంలో పనిచేసే నలుగురు ఉద్యోగులు.. మల్లన్నసాగర్‌ దగ్గర తమకు సాగునీరు అందుతున్నదని.. వ్యవసాయం చేసుకొంటామని చెప్పి ఊరికి వెళ్లిపోవడం ఇందుకు ఉదాహరణ. కరోనా సమయంలో ఊళ్లకు వెళ్లినవారందరినీ గ్రామీణ ఉపాధిహామీ పథకం ఆదుకొన్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరువ తీసుకొని ప్రతి ఒక్కరికీ పని కల్పించింది. దీనికితోడు వ్యవసాయ పనుల ద్వారా లక్షల మందికి ఉపాధి దొరికింది. పల్లెల్లో ఆదాయానికి తగ్గట్టే వ్యాపారమూ పెరిగింది. కిరాణా దుకాణాలు మొదలు.. అన్నిరకాల వ్యాపారాలు దాదాపు 40 శాతం పెరిగినట్టు అంచనా. బైక్‌లు, కార్లు, ట్రాక్టర్ల అమ్మకాలు బాగా పెరిగాయి. లాక్‌డౌన్‌కు ముందు అమ్మకాలతో పోల్చితే జూన్‌లో బైక్‌ల అమ్మకాలు రెట్టింపు అయ్యాయి. వీటిలో అధికశాతం గ్రామాల్లోనే జరిగినట్లు మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. ట్రాక్టర్ల అమ్మకాలు 25% పెరిగాయి. 

సంపద సృష్టికి కేంద్రాలు 

పెరిగిన సాగు విస్తీర్ణం.. ప్రభుత్వమే పంట కొనుగోలుచేయడం.. పల్లెలను సంపద సృష్టి కేంద్రాలుగా మార్చాయి. మిషన్‌ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ జరుగడం, కాళేశ్వరంతోపాటు వివిధ ప్రాజెక్టులు పూర్తయి పొలాలకు నీళ్లుచేరడంతో సాగువిస్తీర్ణం పెరిగిపోయింది. తెలంగాణలో ఆరేండ్లలోనే ధాన్యం కొనుగోళ్లు 367% పెరిగి, 1.12 కోట్ల టన్నులకు చేరడమే ఇందుకు నిదర్శనం. చేపలు, గొర్రెలు, పాడి బర్రెల పంపిణీతో వ్యవసాయ అనుబంధ రంగాలు అభివృద్ధి చెందాయి. ఈ క్రమంలో రైతులు, వ్యవసాయ కూలీలు, కుల వృత్తిదారులు, వ్యాపారులు ఇలా గ్రామాల్లోని ప్రతి గడపలోనూ కాసులు గలగలలాడుతున్నాయి. గ్రామాల్లో నగదు ప్రవాహం 30 నుంచి 40 శాతం వరకు పెరిగిందని నిపుణులు చెప్తున్నారు. దీంతో ట్రాక్టర్ల కొనుగోలుకు ఊతమిచ్చింది. పాత ట్రాక్టర్లు చేతులు మారడం ఒక వంతైతే.. కొత్త కొనుగోళ్ల సంఖ్య కూడా బాగా పెరిగింది. 

ఈ ఏడాది ఇప్పటివరకు సాగు యంత్రాల రిజిస్ట్రేషన్లు ఏకంగా 109 % పెరగటం విశేషం. కరోనా సంక్షోభంలోనూ తెలంగాణ వ్యవసాయరంగం చెక్కుచెదరకపోవడంతో గ్రామీణప్రాంతాల్లో ద్విచక్ర వాహనాల కొనుగోళ్లు కూడా పెరిగాయి. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల కింద సాగువిస్తీర్ణం తెలంగాణ గ్రామీణ ఆర్థిక ముఖచిత్రంలో గణనీయమైన మార్పులు తీసుకొచ్చింది. నెలన్నరగా ట్రాక్టర్లు, వరికోత యంత్రాల రిజిస్ట్రేషన్లు భారీగా నమోదవుతున్నాయి. గతేడాది జూన్‌వరకు సాగు యంత్రా ల రిజిస్ట్రేషన్లు 13 వేల పైచిలుకు ఉంటే.. ఈ ఏడాది ఇప్పటివరకు 28 వేలకుపైగా రిజిస్ట్రేషన్‌ అయ్యాయి. ముఖ్యంగా వరంగల్‌, కరీంనగర్‌ ప్రాంతాల నుంచి చాలామంది మిర్యాలగూడ, హుజూర్‌నగర్‌ ప్రాంతాలకు వెళ్లి పాత ట్రాక్టర్లను కొన్నట్టు సమాచారం. 

నెలన్నరలోనే పది వేలకు పైగా..

లాక్‌డౌన్‌ అనంతరం రిజిస్ట్రేషన్లకు అనుమతిచ్చిన మే ఏడో తేదీ నుంచి జూన్‌ 30 వరకు 10,333 ట్రాక్టర్లు, వరికోత యంత్రాల రిజిస్ట్రేషన్లు అయ్యాయి. 2019 జనవరి నుంచి జూన్‌ వరకు అంటే ఆరునెలల్లో 13,736 రిజిస్ట్రేషన్లు జరిగితే, గత 45 రోజుల్లోనే కరోనా సంక్షోభంలో ఈ స్థాయి రిజిస్ట్రేషన్లు కావడం తెలంగాణ వ్యవసాయరంగంలో యాంత్రీకరణ వేగానికి అద్దం పడుతున్నది. గ్రామీణ ప్రాంతాల్లో ద్విచక్రవాహనాల కొనుగోళ్లు కూడా భారీగా జరుగడం అక్కడ కొనుగోలుశక్తి పెరిగిందనడానికి ఒక నిదర్శనం.

గత మూడు నెలల్లో పల్లెలకు చేరిన ఆదాయం
పంట కొనుగోళ్ల ద్వారా: రూ.50వేల కోట్లు
పేదలకు లాక్‌డౌన్‌ నగదు: రూ.1,500కోట్లు
రైతుబంధు నిధులు  : రూ.7వేల కోట్లు
పనికి ఆహారపథకం నిధులు: రూ.1,680కోట్లు
గత మూడునెలల్లో పింఛన్ల సొమ్ము:  రూ. 2,500 కోట్లు


పల్లెల్లో క్యాష్‌ ఫ్లో పెరిగింది 

లాక్‌డౌన్‌తో పట్నాల్లోని కూలీలు, చిరుద్యోగులు, విద్యార్థులు సొంతూళ్లకు వెళ్లిపోయారు. గ్రామాల్లో 30-40% జనాభా పెరిగింది. వ్యవసాయ పనులు, ఉపాధి హామీ, ఇతర పనుల రూపంలో వారికి ఉపాధి దొరికింది. ఫలితంగా ఆహారపదార్థాలు, ఇతర వస్తువుల కొనుగోళ్లు పెరిగాయి. పల్లెల్లో 30-40 % నగదు ప్రవాహం పెరుగటం కనిపిస్తున్నది. 1970 తర్వాత గ్రామాల నుంచి పట్నాలకు వలస రావడం బాగా పెరిగింది. ఇప్పుడు లాక్‌డౌన్‌ వల్ల గ్రామీణ వలసలు రివర్స్‌ అయ్యాయి. 

- అనిల్‌ రెడ్డి, ఎఫ్‌టీసీసీఐ మాజీ అధ్యక్షుడు 

రాష్ట్రంలో 2019, 2020లో జూన్‌ వరకు సాగు యంత్రాల రిజిస్ట్రేషన్లు..

క్యాటగిరీ
2019
2020
కోత యంత్రాలు
253 
1,042
ట్రాక్టర్లు
13,483
27,772
మొత్తం
13,736
28,814

రాష్ట్రంలో 2019, 2020లో జూన్‌ వరకు సాగు యంత్రాల రిజిస్ట్రేషన్లు..

క్యాటగిరీ    
 2019   
 2020
కోత యంత్రాలు    
253 
1,042
ట్రాక్టర్లు 
13,483   
 27,772
మొత్తం      
13,736    
28,814


logo