రామచంద్రాపురం, జనవరి 21: రాష్ట్ర ప్రభుత్వం పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూర్ గ్రామంలోని ఆదర్శ టౌన్షిప్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లు చాలా బాగున్నాయని పార్లమెంటరీ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ స్టాండింగ్ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. శనివారం కమిటీ చైర్మన్ రాజీవ్ రంజన్సింగ్ అలియాస్ లలన్సింగ్ నేతృత్వంలో స్టాండింగ్ కమిటీ బృందం సభ్యులు డబుల్ ఇండ్లను పరిశీలించారు.
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ సత్యనారాయణ, జీహెచ్ఎంసీ హౌసింగ్ ఓఎస్డీ సురేశ్ బృందం సభ్యులకు వివరించారు. మొత్తం 124 ఎకరాల విస్తీర్ణంలో 117 బ్లాక్లతో 15,660 డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం నిర్మించిందని తెలిపారు. ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.1480 కోట్లు ఖర్చు చేసిందని, ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.8.50 లక్షలు ఖర్చు కాగా, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం రూ.1.50 లక్షలు కేటాయించిందని చెప్పారు. డీఈసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఇండ్లను నిర్మించిందన్నారు.
ఈ ప్రాజెక్ట్కు కేటాయించిన భూమిలో 20 శాతం నిర్మాణాలు, 80 శాతం స్థలంలో రోడ్లు, పా ర్కింగ్, గ్రీనరీ, పార్కులు, షాపింగ్ కాంప్లెక్స్, పోలీస్స్టేషన్, ఆలయం, దవాఖాన, క్రీడా మైదానం, విద్యుత్తు సబ్స్టేషన్ తదితర సౌకర్యాలు కల్పించినట్టు పేర్కొన్నారు. ఇండ్ల లోపలికి వెళ్లి గదులు, హాల్, కిచెన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఒక్కరిద్దరు ఎంపీలు ‘కంగ్రాట్స్ కేటీఆర్’ అని కితాబునిచ్చారు. కార్యక్రమంలో రంగారెడ్డి కలెక్టర్ అమోయ్కుమార్, సంగారెడ్డి అదనపు కలెక్టర్లు రాజర్షిషా, వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.