హైదరాబాద్, ఆగస్టు 22, (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నాయకులు గొప్పగా చెప్పుకొనే గుజరాత్ మాడల్ అన్నది పచ్చి గోల్మాల్ అని, డబుల్ ఇంజిన్ సర్కార్ ఒట్టి ట్రాష్ అని టీఆర్ఎస్ నాయకుడు, రాష్ట్ర మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ క్రిషాంక్ పేర్కొన్నారు. దీన్ని నిరూపించే సాక్ష్యాధారాలతో ఆయన మరో 3 వీడియోలను విడుదల చేశారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వరాష్ట్రమైన గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ దుస్థితిని కళ్లకు కట్టే కథనాలను క్రిషాంక్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల నాటికి దేశంలో ప్రతి ఒక్కరికీ పక్కా ఇండ్లు నిర్మించి ఇస్తామన్న ప్రధాని మోదీ హామీని ప్రస్తావిస్తూ.. స్మార్ట్ సిటీగా చెప్పుకొనే అహ్మదాబాద్లోని మురికివాడలను ఈ వీడియోల్లో చూపించారు.
గతంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అహ్మదాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు అక్కడి మురికివాడలు కనిపించకుండా పరదాలను అడ్డం పెట్టిన దృశ్యాన్ని, ఆ పరదాల వెనుక ఉన్న మురికివాడలను ఈ వీడియోలో పొందుపర్చారు. తెలంగాణలో మూసీ నది ప్రక్షాళనపై బీజేపీ నాయకులు మాట్లాడుతున్న మాటలను క్రిషాంక్ ప్రస్తావిస్తూ.. అమిత్ షా సొంత నియోజకవర్గమైన గాంధీనగర్లో సబర్మతి నదిలోకి మురికి కాలువ ప్రవహిస్తున్న దృశ్యాన్ని చూపించారు. తెలంగాణకు వచ్చినప్పుడు స్వచ్ఛ భారత్ అని, టాయిలెట్లు కట్టిస్తామని పెద్దపెద్ద మాటలు చేప్పే మోదీ, అమిత్ షా.. అహ్మదాబాద్లోని మురికికూపాలు, రోడ్ల దుస్థితి గురించి ఏమి చెప్తారని క్రిశాంక్ నిలదీశారు. తెలంగాణకు వచ్చి నీతులు చెప్పడానికి ముందు గుజరాత్లో మీ ఇంటి వెనుక చూసుకో’ అంటూ అమిత్ షాకు చురక అంటించారు.