మహబూబాబాద్ : అర్హులైన లబ్ధిదారులకు రెండు పడకల గదుల ఇండ్లు మంజూరు చేయిస్తానని పంచాయతీరాజ్ శాఖ ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఆదివారం తొర్రూర్ మండలం చీకటాయ పాలెంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ, 30 లక్షలతో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అలాగే రెండు కోట్ల యాభై రెండు లక్షలతో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లకు మంత్రి జిల్లా కలెక్టర్ శశాంక తో కలిసి ప్రారంభోత్సవం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కరోనా కష్ట కాలంలో కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు, రైతుబంధు వంటి పథకాలను నిరంతరంగా అమలు చేసి పేదలకు అండగా నిలిచారని కొనియాడారు. తన వంతుగా తమ ట్రస్టు ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు అందించానని తెలిపారు. ఆనందయ్య మందులు కూడా అందించినట్లు మంత్రి తెలిపారు. తొర్రూరుకు అంబులెన్స్ స్వయంగా తన సొంత ఖర్చుతో అందజేశానని, అదేవిధంగా ప్రభుత్వ హాస్పటల్ లో ఆక్సిజన్ బెడ్స్ ఏర్పాటు చేయించానని గుర్తు చేశారు.
దళిత బంధు పథకంతో నిరుపేదల జీవితాల ఆర్థిక అభివృద్ధికి ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వం వ్యాక్సిన్ కార్యక్రమం చేపట్టిందని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా టీకాలు తీసుకోవాలన్నారు.గ్రామస్తుల కోరికమేరకు పాలేరు వాగుపై చెక్ డ్యామ్, హరిపిరాల రోడ్డు, రైతుల విజ్ఞప్తి మేరకు ఒకటిన్నర కిలోమీటర్ల సూర్యాపేట రోడ్డు కనెక్టివిటీ త్వరలో చేపడతామన్నారు. అనంతరం చేల్లపాలెంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మంత్రి పరిశీలించారు.