వనపర్తి : వానాకాలంలో వచ్చిన వరి దిగుబడిని ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల అంశంపై నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు.
కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ప్రతి గింజను కొంటామని, రైతులు ఆందోళన చెందవద్దని అన్నారు. యాసంగి పంట విషయంలో కేంద్రం ఇబ్బంది పెడుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన పథకాల వల్ల తెలంగాణ అన్నపూర్ణగా అవతరించిందన్నారు.
రైతుల మనసు కష్టపెట్టకుండా అధికారులు మసలు కోవాలని సూచించారు. రైతు లేకుంటే మనుగడ లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల సాగునీరు పెరిగి దిగుబడి అధికంగా వచ్చింది అన్నారు. స్టోరేజ్ కి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు.