హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): గిరిజన ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని, ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా అధికారులు పనిచేయాలని రాష్ట్ర స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని ఎంసీహెచ్ఆర్డీలో శుక్రవారం ఐటీడీఏ పీవోలు, సహాయ ప్రాజెక్ట్ అధికారులు, డిప్యూటీ డైరెక్టర్లు సహా అన్ని విభాగాల ఉన్నతాధికారులతో ఆమె సమీక్షించారు.
వచ్చే సోమవారం నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో గిరిజన సంక్షేమశాఖ పరిధిలోని విద్యాలయాలన్నింటిలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ఆదేశించారు. ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో విద్యాలయాల ప్రారంభానికి పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలని చెప్పారు. బడి ఈడు పిల్లలను గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లోనే చేరే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి గిరిజన సంక్షేమశాఖ పరిధిలోని అన్ని ఆశ్రమ పాఠశాలలను ఆంగ్లమాధ్యమంలోకి మారుస్తున్న నేపథ్యంలో దీనిపై విస్తృత అవగాహన కల్పించాలని చెప్పారు.
సంక్షేమ విద్యాసంస్థలలో మైనర్ రిపేర్లపై మంత్రి సత్యవతి రాథోడ్ ఆరా తీశారు. నిత్యావసరాలు ముందే అందేలా సమకూర్చుకోవాలని సూచించారు. అలాగే హాస్టల్ విద్యార్థులకు అవసరమైన వస్తువులు, బుక్స్తోపాటు, యూనిఫామ్స్ సరైన సమయంలో అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు.
విద్యార్థుల ఆరోగ్యం విషయంలో అజాగ్రత్త వహించకూడదని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఏఎన్ఎంల ద్వారా ఆరోగ్య పరిరక్షణ చేపట్టాలని, పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని చెప్పారు. గిరి వికాసం, రూరల్ రోడ్స్, ట్రాన్స్పొర్టేషన్, ట్రైకార్ ద్వారా చేపట్టిన అన్ని స్కీములను నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా పూర్తిచేయాలని ఆదేశించారు. గిరిజన ఆవాసాలలో త్రీ ఫేస్ విద్యుదీకరణ పనులు అవసరమైన చోట పూర్తిచేయాలని చెప్పారు.