హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల విద్యాలయాల సంస్థలో ఖాళీగా ఉన్న సీట్లను మెరిట్(Merit) ప్రకారమే కేటాయిస్తున్నామని సంస్థ కార్యదర్శి డాక్టర్ మల్లయ్యభట్టు(Mallaiah Battu) స్పష్టం చేశారు. సీటు రానివారు ఆఫీస్, స్కూల్ చుట్టూ తిరగవద్దని, ఆన్లైన్(Online)లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 5,6,7,8వ తరగతిలో ప్రవేశాలకు(Entrance) నిర్వహించిన రాత పరీక్షల్లో వచ్చిన మార్కులు, మెరిట్ ప్రాతిపదికన ప్రవేశాలు కొనసాగుతాయని వివరించారు.
రెగ్యులర్ ప్రవేశాలు ముగిసిన తరువాత ఖాళీలు ఉన్నట్లయితే అర్హులైన ఇతర విద్యార్థులకు కేటాయిస్తామని స్పష్టం చేశారు. ఎంట్రెన్స్ పరీక్ష రాసినవారు, రాయలేకపోయిన వారు కూడా అందుకోసం కేవలం https://mjptbcwreishms.cgg.gov.in వెబ్సైట్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నవారికే సీట్లు కేటాయింపు ఉంటుందని స్పష్టం చేశారు.
సీట్ల కోసం ఆఫీస్, స్కూల్ చుట్టూ తిరగవద్దని, ఏ అధికారి కూడా దరఖాస్తులను స్వీకరించబోరని వెల్లడించారు. మధ్యవర్తులను నమ్మవద్దని, ఎవరైనా సీట్లు ఇప్పిస్తామని చెబితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.