హైదరాబాద్: బీజేపీ నేతల మాటలు నమ్మి ఓటర్లు మోసపోవద్దని మంత్రి హరీశ్రావు హెచ్చరించారు. మునుగోడు ఎన్నికల తేదీ దగ్గర పడగానే బండి సంజయ్, రఘునందన్, ఈటెల రాజేందర్ ఆరోగ్యం బాగోలేదంటున్నరని, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కూడా అలాగే చేస్తడని మంత్రి తెలిపారు. బీజేపీ వాళ్ల రాజకీయం అలాగే ఉంటదని, చెయ్యి విరిగిందని ఒకరు, కాలు విరిగిందని ఒకరు సానుభూతి కోసం ప్రయత్నిస్తరని, అలాంటివి నమ్మి మోసపోవద్దని చెప్పారు.
ఎల్బీనగర్ సాగర్ రింగ్ రోడ్డు సమీపంలోని ఫంక్షన్ హాల్లో మర్రిగూడ గ్రామ ప్రజలతో నిర్వహించిన సమావేశంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ.. మునుగోడు నుంచి వలస వచ్చిన వారు సొంత ఊర్లకు పోయే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయని ఆయన చెప్పారు. శివన్నగూడెం చెరువులో నీళ్ళు పోయించి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని తెలిపారు.
తెలంగాణ పథకాలవల్ల భూమి విలువ ఎంతో పెరిగిందన్నారు. తెలంగాణ ఎంత బాగుపడ్డదో మీ కళ్ళ ముందే కనిపిస్తుందని చెప్పారు. అప్పట్లో తెలంగాణ కోసం మేము రాజీనామా చేస్తే.. బీజీపీ కిషన్ రెడ్డి రాజీనామా చేయలేదని మంత్రి హరీశ్రావు గుర్తుచేశారు. మర్రిగూడ దిక్కు మర్రిచూడని రాజగోపాల్ రెడ్డికి మనం ఎందుకు ఓటు వేయాలని ఆయన ప్రశ్నించారు.
మంచి మనసున్న మర్రిగూడెం ప్రజలకు అదృష్టంకొద్ది తాను ఇన్చార్జిగా వచ్చానని వ్యాఖ్యానించారు. మీ గ్రామ ప్రజలంతా గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కోరుతున్నారని, అంతకుమించి ఏమీ అడగటం లేదని మంత్రి చెప్పారు. నేను మీకిచ్చే హామీ ఒక్కటేనని, మూడు నెలలకు ఒకసారి మీ ఊరుకు వస్తానని, అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు.