నందిపేట్ : కాంగ్రెస్, బీజేపీ(Congress) పార్టీలను నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చెప్పినవి చెప్పినట్లు చేస్తున్న బీఆర్ఎస్ను నమ్ముదామా లేదా కొత్త కథలు చెబుతున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను నమ్ముదామా అన్నది ఆలోచించాలని కోరారు. ఆ రెండు పార్టీలు ప్రజల గురించి ఎప్పుడూ ఆలోచించవని విమర్శించారు. నిత్యం తెలంగాణ ప్రజల బాగు కోసం ఆలోచించే సీఎం కేసీఆర్ ను మరోసారి ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు.
నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలంలో జరిగిన మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనంలో ఆర్మూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డితో కలిసి కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత ప్రసంగిస్తూ..బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజల గురించి ఆలోచించవని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తేలు వంటిదని ధ్వజమెత్తారు. ఒక్క అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అంటున్నదని, 10 సార్లు అవకాశం ఇస్తే కాంగ్రెస్ ఏం చేసిందని నిలదీశారు.
కర్ణాటకలో అధికారంలోకి వచ్చి మూడు నెలలు గడిచినా ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చే ప్రయత్నం చేయడం లేదని, పెన్షన్లు, కరెంటు ఇవ్వడం లేదని విమర్శించారు. మూడో సారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కటాఫ్ డేట్ తో సంబంధం లేకుండా బీడీ కార్మికులందరికీ పెన్షన్లు అందిస్తామని ప్రకటించారు. ఆర్థిక భారం తగ్గించాలన్న ఉద్దేశంతో రూ.1200 గా ఉన్న గ్యాస్ సిలిండర్ ను రూ. 400 కే సబ్సిడీ కింద ఇస్తామని అన్నారు. జీవన్ రెడ్డిని ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.