దుగ్గొండి, అక్టోబర్ 24: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం చేయించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్ప సిద్ధికి ప్రజలు జైకొడుతున్నారు. తాము సైతం మహాత్కార్యానికి ఉడుతా భక్తిగా సమర్పించుకొంటామని ముందుకొస్తున్నారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లి గ్రామస్థులంతా కలిసి మూకుమ్మడిగా తొలి అడుగువేశారు. యాదాద్రి కోసం ఊరుఊరంతా విరాళమెత్తింది. రెండ్రోజుల్లోనే రూ.15వేలు సేకరించారు. గ్రామ సర్పంచ్ పెండ్యాల మమతారాజు దంపతులు, గ్రామ పంచాయతీ పాలకవర్గం, సిబ్బంది విరాళాల సేకరణలో ఉత్సాహంగా పాల్గొన్నారు. దాతలు, పెద్దలు రూ.పదివేలు విరాళంగా ఇవ్వగా, మరుసటి రోజు పలువురు చిన్నారులు తమ కిడ్డీ బ్యాంకుల్లో దాచుకొన్ని డబ్బును విరాళంగా ఇవ్వడం విశేషం. గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు తమ వంతు సహాయంగా రూ.1,000 విరాళంగా అందజేశారు. గ్రామంలోని కిరాణా వర్తకులు, చిరువ్యాపారులు, మహిళా సంఘాల సభ్యులు ఇలా అన్ని వర్గాలవారు తలోచేయి వేశారు. సర్పంచ్ కుమారుడు పెండ్యాల రాజు రూ.ఐదు వేలు ఇచ్చారు.