హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో బాయిల్డ్ రైస్ను కొనుగోలుచేసే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభు త్వం తేల్చిచెప్పిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని యాసంగిలో వరి సాగుచేయవద్దని రైతులకు సూచించారు. మిల్లర్లు, విత్తన కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకొన్న రైతులు మాత్రం వరి సాగుచేసుకోవచ్చని చెప్పారు. తెలంగాణ నుంచి 40 లక్షల టన్నుల బియ్యం సేకరణకు కేంద్రం అంగీకరించిందని, అంత కంటే ఎక్కువ తీసుకొనే పరిస్థితి లేనందున అధికారులు జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేశారు. శనివారం ఆయన బీఆర్కే భవన్లో డీజీపీ మహేందర్రెడ్డి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావుతో కలిసి యాసంగి సాగు, ధాన్యం కొనుగోళ్లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని, అవసరమైన చోట కొత్తగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్లను, ఇతర ఉన్నతాధికారులను ఆదేశించారు.
పొరుగు రాష్ర్టాల ధాన్యాన్ని రానివ్వొద్దు
ఇతర రాష్ర్టాల నుంచి తెలంగాణలోకి ధాన్యం రాకుండా అడ్డుకోవాలని సీఎస్ ఆదేశించారు. తెలంగాణలోని కొనుగోలు కేంద్రా ల్లో ఇతర రాష్ర్టాల ధాన్యాన్ని కొనవద్దని, ఇది తెలంగాణ రైతుల ప్రయోజనాలకు విరుద్ధమని తెలిపారు. సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, పౌరసరఫరాలశాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.