సుల్తాన్బజార్, ఆగస్టు 3: ఉస్మానియా దవాఖానలో ఆరేండ్ల బాలుడికి కాలెయ మార్పిడి శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. ప్రైవేటు హాస్పిటళ్లలో రూ.30 లక్షలకుపైగా ఖర్చయ్యే ఆపరేషన్ను పూర్తి ఉచితంగా జరిపారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం చెల్లాపూర్కు చెందిన పర్వతాపురం చెన్నయ్య, యశోద దంపతుల కుమారుడు సాయిప్రణీత్ (6) లివర్ సమస్యతో బాధపడుతూ నెల క్రితం ఉస్మానియాలోని గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగంలో చేరాడు. విభాగం హెచ్వోడీ డాక్టర్ మధుసూదన్ అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి బాలుడికి కాలేయ మార్పిడి అత్యవసరమని గుర్తించారు.
బాలుడి తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పడంతో తండ్రి లివర్ను ఇవ్వడానికి ముందుకొచ్చాడు. 250 గ్రాముల లివర్ను సేకరించిన సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, నిలోఫర్ పీడియాట్రిషన్, నెఫ్రాలజీ, అనస్థీషియా వంటి విభాగాల సమన్వయంతో సుమారు 20 గంటలపాటు శ్రమించి బాలుడికి లివర్ మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తిచేశారు. తండ్రి, కుమారుడు కోలుకోవడంతో గురువారం డిశ్చార్జి చేస్తున్నట్టు దవాఖాన సూపరింటెండెంట్ బీ నాగేందర్ చెప్పారు. జీవన్దాన్ డే సందర్భంగా దాత, గ్రహీతతో కేక్ కట్చేయించి వారిద్దరిని సత్కరించారు.