గద్వాల అర్బన్, మే 6: పురిటిలోనే పసికందు మృతి చెందిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో చోటు చేసుకున్నది. బాధితుల కథనం మేరకు.. గట్టు మండలం బోయాలగూడెంకు చెందిన సుజాత పురిటి నొప్పులు రావడంతో సోమవారం ప్రభుత్వ దవాఖానకు తీసుకురాగా ప్రసవ సమయంలో పసికందు మృతి చెందింది. దీంతో బంధువులు వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ దవాఖాన ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
‘ఈ నెల 1న దవాఖానకు వస్తే ఇంకా నొప్పులు రాలేదు కదా.. ఇప్పుడే ఎందుకు వచ్చావ్.. స్కానింగ్ తీసుకుని రావాలి అని చెప్పి పంపించారు. మళ్లీ 3వ తేదీన వస్తే పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రసవ సమయంలో మృతి చెందిందని చేతులు దులుపుకుంటున్నారు’ అని వాపోయారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి దవాఖానకు చేరుకొని వైద్యులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. మహిళకు రక్తపోటు అధికంగా ఉండడడంతో పురిటిలోనే శిశువు మృతి చెందిందని దవాఖాన సూపరింటెండెంట్ కిశోర్ కుమార్ వెల్లడించారు.