హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ క్యాన్సర్ చికిత్స నిపుణుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు.. బుధవారం ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. దశాబ్దాల పాటు లక్షలాది మందికి అద్భుతమైన వైద్య సేవలందించిన దత్తాత్రేయను కలవడం పట్ల కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వైద్య రంగంలో, ముఖ్యంగా క్యాన్సర్ చికిత్సా విధానాల్లో వివిధ దేశాలు అనుసరిస్తున్న ఆదర్శనీయమైన పద్దతులపైన ఇరువురు చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగంలో చేపట్టిన పలు వినూత్న కార్యక్రమాల వివరాలను కేటీఆర్ దత్తాత్రేయుడికి అందించారు. ఈ కరోనా సంక్షోభం తర్వాత అన్ని ప్రభుత్వాలు ఆరోగ్య రంగంలో భారీ ఎత్తున నిధులు ఖర్చు చేసేందుకు సుముఖంగా ఉన్నాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రభుత్వ ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ తెలిపారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రం సాధిస్తున్న ప్రగతి, చేపట్టిన కార్యక్రమాలను నోరి దత్తాత్రేయుడు ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టే అన్ని రకాల వైద్య కార్యక్రమాలకు ముఖ్యంగా క్యాన్సర్ సంబంధిత కార్యక్రమాలకు తన మద్దతు ఉంటుందని నోరి దత్తాత్రేయుడు స్పష్టం చేశారు. తన వైద్య విద్య, వృత్తి హైదరాబాదులోనే ప్రారంభమైందని ఇలాంటి రాష్ట్రానికి తిరిగి మరిన్ని సేవలు అందించేందుకు ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటానని డాక్టర్ నోరి దత్తాత్రేయుడు పేర్కొన్నారు.