నారాయణపేట, నవంబర్ 20: పల్లె ప్రజలకు ఇంటి వద్దే నాణ్యమైన వైద్య సేవలు ఉచితంగా అందించాలనే ఇద్దరు ఎన్నారైల సంకల్పం సత్ఫలితాలను ఇస్తున్నది. నారాయణపేట జిల్లాలో చేపట్టిన ‘మన ఊరికి.. మన ఆరోగ్య వాహిని’ కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తున్నది. ఐదు నెలల కిందట ప్రారంభమైన ఆరోగ్య వాహిని ప్రయాణం.. ఏకంగా పది గ్రామాలను 400 సార్లు సందర్శించి 9000 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేసింది. హై డెఫినేషన్ స్టెతస్కోప్తో ఈసీజీ, గుండె చప్పుడును ఐ ప్యాడ్లో నమోదు చేసి, వర్చువల్ విధానంలో హైదరాబాద్ నుంచి గుండె సంబంధిత వైద్యులకు తెలియజేసి వారి నుంచి వైద్య సలహాలు తీసుకొని మందులను అందిస్తున్నారు. తమ గ్రామాలకే వచ్చి వైద్య పరీక్షలు, చికిత్స చేసి అవసరమైన మందులను కూడా ఉచితంగా అందిస్తున్న ఆరోగ్య వాహిని సేవలను ఆయా గ్రామాల ప్రజలు కొనియాడుతున్నారు. హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్లు అయిన సురేశ్ చల్లా, సాయి ప్రతాప్ అనే ఇద్దరు మిత్రులు అమెరికాలో స్థిరపడ్డారు.
టెలీమెడిసిన్ విధానం ద్వారా గ్రామీణ ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించాలని భావించారు. అప్పటికే ఈపిక్స్ అనే స్వచ్ఛంద సంస్థలో ట్రస్టీలుగా ఉన్న వీరు.. దవా-ఖాన అనే ప్రాజెక్టుకు ఫౌండర్ కం చైర్మన్గా సురేశ్ చల్లా, ఫౌండర్ కం సీఈవోగా సాయిప్రతాప్ బాధ్యతలు తీసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆరోగ్య వాహిని కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. బ్లడ్ డ్రైవ్ పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో రక్త నమునాలు సేకరించి, రక్త పరీక్షల నిర్వహణకు వేణిరావు సంస్థ అందించిన రెండు బస్సులను దవా – ఖాన ప్రాజెక్టుకు కలెక్టర్ కేటాయించారు. రెండు బస్సుల్లో మార్పులు చేయించారు. ప్రతి బస్సులో రెండు బెడ్లు, డాక్టర్ డెస్క్, ల్యాబ్, మెడిసిన్ల నిల్వకోసం రిఫ్రిజిరేటర్, టెలిమెడిసిన్ ప్రొజెక్టర్, సీసీ కెమెరాలు, జీపీఆర్ఎస్ సదుపాయలను కల్పించారు. తొలి విడతలో నారాయణపేట మండలంలోని పది గ్రామాలను ఎంపిక చేశారు. ప్రతి రోజు రెండు గ్రామాలు, వారంలో ఐదు రోజులకు పది గ్రామాల్లో పర్యటించి, వైద్య సేవలు అందిస్తున్నారు. తొలి విడతగా ఏడు మంది వైద్య సిబ్బందితో సేవలందిస్తున్నారు. వీరి వేతనాలకు అయ్యే మొత్తంతోపాటు బస్సు మెయింటనెన్స్, డీజీల్ను సైతం ఈపిక్స్ సంస్థ నిర్వాహకులు భరిస్తున్నారు.
నాన్నే నాకు ఆదర్శం
మా నాన్న ప్రతాప్ నర్సింగ్రావు రైల్వేలో వైద్యసేవలు అందించేవారు. మా నాన్న అంటే మా ప్రాంత వాసులకు ఎంతో అభిమానం ఉండేది. ఇప్పటికీ ఆయన బిడ్డగా నన్ను ఎంతో గౌరవిస్తుంటారు. డబ్బులు ఎంతో మందికి ఉం టాయి కానీ, సేవ చేసే ఆలోచన గు ణం కొందరికే ఉం టుంది. మా నాన్న చూపిన సేవా బాట లో నేను పయనించాలని అనుకునే వాడిని. నా స్నేహితుడు సురేశ్ చల్లాకు కూడా అదే అభిప్రాయం ఉండేది. దీంతో ఇద్దరం కలిసి దవా – ఖానా అనే సేవా సంస్థను స్థా పించాం. ఆరోగ్య వాహిని ద్వారా గ్రామీ ణ ప్రాంత ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నాం. రానున్న రోజుల్లో ఇందు లో ప్రజలను భాగస్వాములను చేస్తాం.
– సాయిప్రతాప్, సీఈవో, దవా-ఖాన ప్రాజెక్ట్