హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా 2021-22 వానకాలం ధాన్యం కొనుగోలు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఇదే అంశంపై సోమవారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హైదరాబాద్లోని తన కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సివిల్ సప్లైస్ కమిషనర్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో సివిల్ సప్లైస్ శాఖా పరంగా చేసిన ఏర్పాట్లను మంత్రికి అధికారులు వివరించారు.
గన్నీల అందుబాటు, ట్రాన్స్ పోర్టు ఏర్పాట్లు, అకాల వర్షాల నుంచి ధాన్యం తడవకుండా టార్పాలిన్ల ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను అదేశించారు. ఇప్పటికే రాష్ట వ్యాప్తంగా 1033 కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని మంత్రి తెలిపారు. పంట కోతలు పూర్తయిన ప్రాంతాల్లోనూ అవసరమైన చోట తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడానికి కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలను ఇచ్చామని మంత్రి తెలిపారు.
ధాన్యంకు సరిపడా గన్నీలు అందుబాటులో ఉన్నాయని, రైతుసోదరులకు ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. తప్పుడు ప్రచారాన్ని పట్టించుకోవద్దన్నారు.
కొనుగోలు పూర్తయిన తర్వాత తరలించడానికి ట్రాన్స్ పోర్టు సదుపాయాలు కూడా పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని, రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతున్నాయని మంత్రి గంగుల తెలిపారు.
సివిల్ సప్లైస్ శాఖలోని ఐటీ వింగ్ మరింత బలోపేతం చేసి దాని ద్వారా శాఖపరమైన అంశాలను నిరంతరం పర్యవేక్షిస్తామన్నారు. ఇందుకు సంబందించిన కావాల్సిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సివిల్ సప్లైస్ కమిషనర్ అనిల్ కుమార్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.