హైదరాబాద్ : రజకుల లాండ్రీ షాపులు, దోబీఘాట్లు, నాయీబ్రాహ్మణుల సెలూన్లకు ఇచ్చిన ఉచిత విద్యుత్ కనెక్షన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించొద్దని సంబంధిత అధికారులను తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా లాండ్రీలు, సెలూన్లకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.
బీసీ సంక్షేమశాఖ సహకారంతో దాదాపుగా 1,02,631 మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. అయినప్పటికీ విద్యుత్ అధికారులు పలు చోట్ల బిల్లుల బకాయి పేరిట ఉచిత్ కనెక్షన్లను తొలగిస్తున్నారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించిన కనెక్షన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ కట్ చేయకూడదని అధికారులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
దీనిపై రజక సంఘాల సమితి ముఖ్య సలహాదారు, ఎంబీసీ రాష్ట్ర కో కన్వీనర్ కొండూరు సత్యనారాయణ, నాయీ బ్రాహ్మణ సేవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాసమల్ల బాలకృష్ణ, ఉపాధ్యక్షుడు గడల రాజు, రాష్ట్ర నేతలు కోట్ల శ్రీనివాస్, ఎల్లంగౌడ్, పురోషోత్తం, ముదిగొండ మురళీ, చిట్యాల రామస్వామి తదితరులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు, విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రకటన విడుదల చేశారు.