హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): లాభాల్లో నడుస్తున్న అనేక ప్రభుత్వరంగ సంస్థలను కేంద్రప్రభుత్వం ప్రైవేట్పరం చేస్తున్నదని ఎంపీ బండా ప్రకాశ్ ఆందోళన వ్యక్తంచేశారు. గురువారం ఆయన రాజ్యసభలో మాట్లా డుతూ ఎల్ఐసీని ప్రైవేట్పరంచేస్తే బీమా సొమ్ము కు పూచీ ఎవరనే భయాందోళనలో ప్రజలు ఉన్నారని పేర్కొన్నారు. ఎల్ఐసీని ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసినప్పుడు నాటి ప్రధాని నెహ్రూ.. ఎల్ఐసీ లాభాపేక్ష కాకుండా ప్రజాసేవలో భాగమవుతుందని ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రపంచంలోనే ప్రఖ్యాత సంస్థగా నిలబడిన ఎల్ఐసీకి దేశంలో రూ.32 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయని, ఇటువంటి సంస్థను ప్రైవేట్పరం చేసి దేశ ప్రతిష్టకు భంగం కలిగించకూడదని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
దేశంలోని ప్రతిష్ఠాత్మక ఉన్నత విద్యాలయాల్లో, హైకోర్టుల్లో, సుప్రీంకోర్టులో రిజర్వేషన్లు అమలు చేయాలని బండా ప్రకాశ్ డిమాండ్ చేశారు. ఉన్నత విద్యపై రాజ్యసభలో గురువారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఐఐఎం, ఐఐటీ సహ అనేక ఉన్నత విద్యా సంస్థల్లో రిజర్వేషన్లను అమలు చేయటంలేదని ఆయన ఈ సందర్భంగా సభ దృష్టికి తెచ్చారు. యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా రిజర్వేషన్లు పాటించని విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలన్నారు. కింది కోర్టుల పోస్టుల భర్తీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లను పాటిస్తున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం వాటిని అనుసరించటంలేదని తెలిపారు.