కరీంనగర్ : కరోనా వైరస్ అనేది ఓ వింత రోగం అని.. దీని పట్ల ఎవరూ నిర్లక్ష్యం వహించొద్దని రాష్ర్ట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. కరీంనగర్ జిల్లా ఆస్పత్రిలో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ను ప్రారంభించిన అనంతరం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు.
గాలిలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నందున అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఇదొక వింత రోగం. ఏం లక్షణాలున్నా వైద్యులని కలవాలి. ర్యాపిడ్ టెస్టులు, ఆర్టీపీసీఆర్ టెస్టుల ఫలితం వచ్చే వరకు ఆలస్యమైతే.. లక్షణాలు ఉంటే డాక్టర్ను సంప్రదించి తక్షణమే ట్రీట్మెంట్ తీసుకోవాలి. నిర్లక్ష్యం కారణంగానే ప్రాణాలు పోతున్నాయి. వైరస్ సోకిన కొందరిలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. అయినప్పటికీ ఆ వైరస్ ఊపిరితిత్తులపై ప్రభావం చూపి, క్షణాల్లో ప్రాణాలను తీస్తుందన్నారు. పాజిటివ్ అని తెలిస్తే.. నిర్లక్ష్యం చేస్తున్నవారే మరణిస్తున్నారు అని ఈటల పేర్కొన్నారు.
కరీంనగర్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ట్యాంకు సామర్థ్యం 20 కేఎల్ అని తెలిపారు. ఈ ఆక్సిజన్ ఏడు రోజుల వరకు వస్తుందన్నారు. ఆర్టీపీసీఆర్ టెస్టులు పెంచాలనే ఉద్దేశంతో.. ఇక్కడ ఆ మిషన్ను ఏర్పాటు చేశాం. దాంట్లో 400 టెస్టులు చేసే ఆస్కారం ఉంటుంది. ఆటోమేటిక్ మిషన్ అందుబాటులోకి వస్తే రోజుకు 1000 టెస్టులు చేసుకోవచ్చు. ప్రయివేటు ల్యాబ్ల మీద ఆధారపడకుండా ఈ సౌకర్యం కల్పించామన్నారు.
రాష్ర్టంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత లేదు అని మంత్రి ఈటల స్పష్టం చేశారు. రెండు, మూడు రోజుల్లో ప్రయివేటు ఆస్పత్రుల్లోనూ ఆక్సిజన్ కొరత తీరుతుందన్నారు. మనకు ఆక్సిజన్ను విశాఖ నుంచి కేటాయించలేదు. 1300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒడిశా నుంచి యుద్ధ విమానాల్లో ఆక్సిజన్ను తెప్పిస్తున్నామని తెలిపారు. టెస్టు కిట్ల కొరత కూడా రాష్ర్టంలో లేదన్నారు. జగిత్యాల, మహారాష్ర్టకు రాకపోకల వల్లే అక్కడ ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.