హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ భూముల్లో 50గజాల స్థలంలో ఇండ్లు నిర్మించుకొని జీవిస్తున్న వారందరికీ పట్టాలు ఇచ్చి సహకరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. గురువారం సీపీఐ నాయకుల బృందం ప్రభుత్వ సలహాదారు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఇటీవల హనుమకొండ జిల్లాలోని గుండ్ల సింగారంలో అమానుషంగా పేదల ఇండ్లు కూల్చివేసిన విషయాన్ని వేం నరేందర్రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు.
అనంతరం సాంబశివరావు మాట్లాడుతూ.. ప్రభుత్వ భూముల్లో నిరుపేదలు 50గజాలలో ఇండ్లు నిర్మించుకొని జీవిస్తున్న వారందరికీ పట్టాలు ఇచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం సహాయం చేయకపోగా వారి ఇండ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేసి రోడ్డున పడవేస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. దీనికి వేంనరేందర్రెడ్డి స్పందిస్తూ.. పేదలకు తప్పకుండా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. వేం నరేందర్రెడ్డిని కలిసిన వారిలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు ఈటీ నర్సింహ, తకళ్లపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం తదితరులు ఉన్నారు.