తెలుగు యూనివర్సిటీ, ఆగస్టు 25 : బీపీ మండల్ కమిషన్ సిఫార్సులను అమలుచేస్తూ జనగణనలో బీసీ కులగణన చేసేవరకూ కేంద్ర ప్రభుత్వాన్ని వదిలేప్రసక్తే లేదని బీసీ నేతలు హెచ్చరించారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం గన్పార్కులోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నిర్వహించిన బీసీ మండల్ జయంతి కార్యక్రమంలో పలువురు బీసీ నేతలు పాల్గొని మండల్ చిత్రపటానికి నివాళులర్పించారు. మండల్ కమిషన్ సిఫార్సులను అమలుచేయాలని కోరుతూ బీసీ సంఘం నేతలు ఆందోళన చేపట్టి పెద్దఎత్తున నినదిస్తూ కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ఈ సందర్భంగా శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ.. బీసీ కులాల లెక్కలు తీయడానికి కేంద్రం భయపడుతున్నదని ఆరోపించారు.
స్వాతంత్య్రం సిద్ధించి 80ఏండ్లు గడుస్తున్నా ప్రజాస్వామ్య వ్యవస్థలో మెజారిటీ ప్రజలుగా ఉన్న బీసీలు అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడటం సిగ్గుచేటని మండిపడ్డారు. మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న జనగణనలో బీసీ కులగణన చేయాలనే ఆందోళనకు పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులు మద్దతు తెలుపాలని కోరారు. లేకుంటే బీసీ జాతికి ద్రోహం చేసినవారవుతారని హెచ్చరించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. మండల్ కమిషన్ సిఫార్సులు అమలుచేయకుండా అగ్రకుల ప్రభుత్వాలు బీసీలను నిర్లక్ష్యానికి గురిచేస్తున్నాయని ఆరోపించారు. శ్రీనివాస్, కృష్ణ, గణేశాచారి, శ్యామ్, మహేశ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.