హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముగిశాక ఓటర్ల మానసిక ప్రశాంతతకు ఎలాంటి భంగం కలిగించరాదని, సినిమా హాళ్లతోపాటు టీవీలు, ఇతర ప్రచార సాధనాల ద్వారా ఎన్నికలకు సంబంధించిన అంశాలను ప్రదర్శించకూడదని సీఈవో వికాస్రాజ్ అన్ని రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు స్పష్టం చేశారు. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు చేపడతామని హెచ్చరించారు. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు, దెబ్బతీసేందుకు ఉద్దేశించిన ఏ చర్య అయినా దీని పరిధిలోకి వస్తుందని సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రచార పర్వం ముగిసినప్పటి నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు ఎలక్ట్రానిక్ మీడియాలో ఎలాంటి రాజకీయ ప్రకటనలు ప్రసారం చేయకూడదని, ఓపీనియన్ పోల్స్, చర్చా కార్యక్రమాలు, విశ్లేషణలు, విజువల్స్, సౌండ్ బైట్స్ విషయంలో నిబంధనలు పాటించాలని తెలిపారు. ఈ నెల 29, 30 తేదీల్లో రాజకీయ నాయకులు ఎన్నికలకు సంబంధించిన ఇంటర్వ్యూలు ఇవ్వరాదని, పత్రికా గోష్ఠులు నిర్వహించరాదని, బల్ ఎస్ఎంఎస్లు పంపకూడదని స్పష్టం చేశారు. మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు విజ్ఞతతో నిర్భయంగా ఓటు వేయాల్సిన ఆవశ్యకతను ఓటర్లకు వివరించాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు.