Congress | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రైతన్నపై కాంగ్రెస్ పగవట్టింది.. ఇప్పుడిప్పుడే తెరిపిన పడుతున్న వ్యవసాయాన్ని దెబ్బకొట్టాలని కంకణం కట్టుకున్నది. ఆ పార్టీ నేతలు పదే పదే చేస్తున్న వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. వ్యవసాయానికి 5 గంటల కరెంటు చాలని కాంగ్రెస్ వ్యూహకర్త, కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ మరోసారి ఉద్ఘాటించారు. శుక్రవారం బెంగళూరులో ఆయన దీనిపై మాట్లాడారు. కర్ణాటకలో తాము 24 గంటలు ఏమీ ఇవ్వడం లేదని 5 గంటలే ఇస్తున్నామని ఆయన గొప్పగా చెప్పుకున్నారు. సాగుకు 3 గంటల కరెంటు చాలు.. కావాలంటే 10హెచ్పీ మోటర్లు పెట్టుకోవాలని రేవంత్, రైతుకు భూమికి కవచంలా నిలిచిన ధరణిని ఎత్తేస్తామని భట్టి విక్రమార్క.. ఇప్పుడు శివకుమార్ అంటున్న మాటలు చూస్తుంటే తెలంగాణ వ్యవసాయాన్ని దెబ్బతీయడానికి కాంగ్రెస్ రహస్య ఎజెండా రచించిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ రైతన్నపై పగబట్టింది. దేశానికి బువ్వపెడుతున్న తెలంగాణ రైతన్నను మళ్లీ దేహీ అనే పరిస్థితికి తీసుకురావాలని కంకణం కట్టుకొన్నది. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఇస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్తుపై కత్తిగట్టింది. ఏదో ఒకటి చేసి రైతుల జీవితాల్లో చీకట్లు నింపాలని కుట్రలు చేస్తున్నది. అందుకే సాగుకు కరెంటు 3 గంటలు చాలని ఒకరంటే.. 5 గంటలు చాలు అని మరొకరు, రైతుబంధు దుబారా అని ఇంకొకరు.. ఇలా చెడును పదేపదే చెప్పి మంచి అని నమ్మించవచ్చన్న విధంగా కాంగ్రెస్ నేతలు ప్రకటనలు చేస్తున్నారు. 60 ఏండ్లు తెలంగాణను ఎడారిగా మార్చిన కాంగ్రెస్ నేతలు.. ఎంతో కష్టపడి పునర్జన్మ ఎత్తినట్టుగా పచ్చబుడుతున్న రాష్ర్టాన్ని మళ్లీ బుగ్గిపాలు చేయాలని కుట్రలకు తెరలేపారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తాజా వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. వ్యవసాయానికి 5 గంటల కరెంటు సరిపోతుందని, అంతకంటే ఎక్కువ అవసరంలేదని ఆయన శుక్రవారం తేల్చిచెప్పారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటకలో రైతులకు తామేమీ 24 గంటల విద్యుత్తు ఇవ్వటంలేదని తెలిపారు. వ్యవసాయానికి 5 గంటలే కరెంటు ఇస్తున్నట్టు స్పష్టంగా చెప్పారు. ‘కర్ణాటక రైతులకు 24 గంటల విద్యుత్తును ఇవ్వట్లేదు. 5 నుంచి 7 గంటలు సరఫరా చేస్తున్నాం. వ్యవసాయానికి ఆ కరెంటు రైతుకు సరిపోతుంది’ అని తెలిపారు. డీకే వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం మండిపడుతున్నది. తెలంగాణలో కాంగ్రెస్కు ఓటేస్తే తమ బతుకులు మళ్లీ అంధకారంలోకి వెళ్తాయని, 24 గంటల ఉచిత విద్యుత్తు 5 గంటలకే పరిమితమవుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కరెంటుపై తొలి నుంచీ కుట్రలే
తెలంగాణ రైతుల గోసతీర్చి, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తుకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ఈ ప్రకటన వెలువడగానే కాంగ్రెస్ విషం చిమ్మింది. 2018లో గాంధీభవన్లో సమావేశమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవుసానికి 9 గంటల కరెంటు చాలని తీర్మానించారు. కాంగ్రెస్ మోసపూరిత కుట్రలను తిప్పిగొట్టిన సీఎం కేసీఆర్.. రైతన్న పక్షాన నిలిచారు. 2018 నుంచి వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తును ఇస్తున్నారు. దీనికోసం రాష్ట్రంలో వినియోగమయ్యే మొత్తం విద్యుత్తులో 33 శాతాన్ని సాగు కోసమే ప్రత్యేకంగా కేటాయించారు. కేసీఆర్ సంకల్పంతో తెలంగాణ రాష్ట్రం దేశానికే బువ్వగిన్నెగా మారింది. రైతన్నకు కరెంటు కష్టాలు తీరాయి. దీనిని చూసి ఓర్వలేని కాంగ్రెస్ మరోసారి తన దుర్బుద్ధిని బయటపెట్టింది. ‘రైతులకు మూడు గంటల కరెంట్ ఇస్తే సరిపోతుంది. 24 గంటల ఉచిత విద్యుత్తు అవసరంలేదు’ అని పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ అంతటా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు ఎవుసానికి 5 గంటల కరెంటు సరిపోతుందని డీకే వ్యాఖ్యానించడంపై సర్వత్రా విమర్శలవర్షం కురుస్తున్నది. తెలంగాణలో 24 గంటల ఉచిత విద్యుత్తుకు ఎగనామం పెట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్ వెన్నుపోటు
వ్యవసాయానికి 24 గంటలపాటు విద్యుత్తును సరఫరా చేస్తామంటూ కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, అక్కడి రైతన్నలను నిండా ముంచింది. ఎడాపెడా కరెంటు కోతలకు తెగబడింది. దీంతో సాగుకు నీరులేకపోవడంతో వేల ఎకరాల పంటలు ఎండిపోయే దుస్థితి దాపురించింది. దీన్ని చూసి తట్టుకోలేని అన్నదాతలు సొంత డబ్బుతో నీటి ట్యాంకర్లను పొలాలకు తెప్పించుకొని పంటను కాపాడుకొన్నారు. కరెంటు విషయంలో మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. హెస్కామ్ కార్యాలయానికి ట్రాక్టర్లో ఓ రైతు మొసలిని తీసుకొచ్చారు. గుల్బర్గా జిల్లాలో ఓ రైతు పురుగుల మందు తాగి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేపట్టారు. కరెంటు కోసం ఆందోళనలు చేసిన రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్టు చేయించి దుర్మార్గంగా వ్యవహరించింది. ఇదేదో తమ గొప్పగా భావించిన డీకే శివకుమార్.. తెలంగాణలోని తాండూరుకు వచ్చి కర్ణాటకలో ఎవుసానికి 5 గంటల కరెంటు ఇస్తున్నట్టు ఆర్భాటంగా చెప్పుకొన్నారు. డీకే వ్యాఖ్యలపై సోషల్మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడిచింది. ‘24 గంటల కరెంటు ఇస్తున్న తెలంగాణ నేతలను.. 5 గంటల కరెంటు కూడా ఇవ్వని కర్ణాటకకు ఎలా ఆహ్వానిస్తున్నారు?’ అంటూ పలువురు నెటిజన్లు డీకేకు చురకలంటించారు.
నేడు...5 గంటల కరెంటు మస్తు!
మేము కర్ణాటకలో 24 గంటల కరెంటేమీ ఇవ్వడం లేదు. రైతులకు 5.. 6.. 7 గంటల కరెంటు ఇస్తున్నం.. వ్యవసాయానికి ఆ మాత్రం కరెంటు సరిపోతుంది.
-డీకే శివకుమార్
నిన్న...3 గంటలు చాలు!
తెలంగాణలో ఎక్కువగా ఉన్నవి చిన్న కమతాలే. వ్యవసాయానికి ఒక గంటసేపు కరెంటు ఇస్తే ఒక ఎకరం పొలం తడుస్తది. కాబట్టి రాష్ట్రంలోని రైతులకు మూడునాలుగు గంటల కరెంటు సరిపోతుంది. కేసీఆర్ ప్రభుత్వం ఇస్తున్నట్టు 24 గంటల కరెంటు రైతులకు అవసరం లేదు. 3 గంటలు చాలు. పొలం పారేందుకు రైతులు 10 హెచ్పీ మోటర్లు బిగించుకోవాలి.
–రేవంత్
మొన్న...ధరణిని తీసిపారేస్తాం..
ధరణిపై ఫిర్యాదులు వస్తున్నాయి. అందుకే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేస్తాం. బంగాళాఖాతంలో వేస్తాం. కౌలుదారు చట్టం తెస్తాం.. అన్ని కాలమ్స్తో కూడిన
పాత పద్ధతిని ప్రవేశపెడతాం.
-భట్టి విక్రమార్క