హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా దీపావళి సంబురాలు అంబరాన్నంటాయి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ప్రజలు పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. దీని వల్ల పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత అనారోగ్యకర స్థాయికి పడిపోయింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఎక్యూఐ) డాటా ప్రకారం.. హైదరాబాద్లో గాలి నాణ్యత 161గా ఉన్నది.
ప్రస్తుతం పీఎం 2.5 పార్టికల్స్ సాంద్రత ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూహెచ్వో) నిర్దేశించిన పరిమితి కన్నా 17.2 రెట్లు అధికంగా నమోదైంది. అమెరికా కాన్సులేట్ స్టేషన్ వద్ద అత్యధికంగా 341 ఏక్యూఐ నమోదవడంతో ఇక్కడ అన్ని ప్రాంతాల కంటే అత్యంత అనారోగ్యకరమైన గాలి ఉన్నట్టు గుర్తించబడింది. ఆ తర్వాతి స్థానాల్లో కేపీహెచ్బీ (237), జూపార్క్ (213), న్యూ మలక్పేట (197), సోమాజిగూడ (177), సైదాబాద్ (170), కోఠి (160), బంజారాహిల్స్ (107) నిలిచాయి.
కోకాపేట ప్రాంతంలో కేవలం 30 ఏక్యూఐ నమోదవగా.. మణికొండ, మాదాపూర్, సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంతాల్లో కూడా ఓ మోస్తరు వాయు నాణ్యత నమోదైంది. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు ప్రమాణాల ప్రకారం గాలిలో పీఎం 2.5 స్థాయికి మించితే పరిస్థితి ఆందోళనకరంగా మారినట్టే. ఈ గాలి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తే ఉబ్బసం, శ్వాసనాళాల వాపు (బ్రాంకైటిస్), గుండె స్పందనలో వృత్యాసాలు లాంటి అనారోగ్యాలకు కారణమవుతుంది. దీంతో గాలి నాణ్యత సరిగా లేని ప్రాంతాల్లో ప్రజలు బయటికి వెళ్లినప్పుడల్లా మాస్కులు ధరించడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.