నల్లగొండ: శాసనమండలి చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన గుత్తా సుఖేందర్ రెడ్డి తొలిసారిగా నల్లగొండకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ నేతలు, శ్రేణులు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. నల్లగొండలోని ఆయన నివాసం వద్ద పెద్దఎత్తున పటాకులు కాల్చారు. తన నివాసం వద్ద గుత్తా సుఖేందర్ రెడ్డి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరీ.. మండలి చైర్మన్ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ నేతలు, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు గుత్తాను కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
శాసనమండలి చైర్మన్గా గుత్తా సుఖేందర్ రెడ్డి రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం ఆయన చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. శాసనమండలి చైర్మన్ ఎన్నికకు సంబంధించి గుత్తా సుఖేందర్ రెడ్డి ఒక్కరే నామినేషన్ దాఖలు కావడంతో.. ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా అధికారులు ప్రకటించారు. కాగా, తెలంగాణ ఏర్పాటైన తర్వాత 2014లో మండలికి తొలి చైర్మన్గా స్వామిగౌడ్ ఎంపికయ్యారు. ఆ తర్వాత 2019 మార్చిలో ఆయన పదవీకాలం ముగియడంతో అప్పటికే ఎమ్మెల్సీగా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి చైర్మన్ ఎంపికయ్యారు. ప్రస్తుతం మళ్లీ చైర్మన్ పదవిని అలంకరించారు.