హైదరాబాద్, మార్చి 29(నమస్తే తెలంగాణ): యాసంగి పంట పెట్టుబడి సాయం కింద ఇప్పటివరకు 92.68% మంది రైతులకు రైతుబంధు పంపిణీ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం వరకు 64.75 లక్షల మంది రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసినట్టు వెల్లడించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంటలపై వ్యవసాయ శాఖ సర్వే చేస్తున్నదని, ఆ వివరాలు రాగానే ఎకరాకు రూ.10 వేల చొప్పున నష్టపరిహారం అందజేస్తామని చెప్పారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన ప్రకారం ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని, ఇందుకోసం సంబంధిత బ్యాంకులతో కలిసి విధి విధానాల రూపకల్పనపై చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.