హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): గత ప్రభుత్వాలు అగ్గిపెట్టలాంటి డబ్బా ఇండ్లను నిరుపేదలకు ఇచ్చి చేతులు దులుపుకున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించేలా డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించారు. అవి పేదల ఆత్మగౌరవ సౌధాలుగా నిలుస్తున్నాయి. ఇప్పటికే వీటి పంపిణీ ప్రారంభమైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో విడతలవారీగా డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ ప్రారంభం కాగా, గురువారం మరో ఏడు ప్రాంతాల్లో 17,676 ఇండ్లను మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే, నాయకులు పంపిణీ చేశారు. పట్టాలు అందుకున్న లబ్ధిదారులు వాటిని చూసి మురిసిపోయారు. తాము డబుల్ బెడ్రూం ఇంటిలో ఉంటామని కలలో కూడా అనుకోలేదని, సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని సంతోషం వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రతి పథకం గడపగడపకు అందుతున్నదని, డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీతో పేదల గుండెల్లో సీఎం కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారని హోంమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. గురువారం కుత్బుల్లాపూర్ పరిధి దుండిగల్ గ్రామంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ శంభీపూర్రాజులతో కలిసి కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, సనత్నగర్, కంటోన్మెంట్(సికింద్రాబాద్) నియోజకవర్గాల నుంచి 2,550 మంది లబ్ధిదారులకు మంత్రి పట్టాలు అందించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ర్టాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసి గోల్డెన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్కే సాధ్యమైందని ప్రశంసించారు.
ప్రపంచస్థాయి వసతులతో తెలంగాణ అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతశోభన్రెడ్డి తెలిపారు. తూముకుంట మున్సిపాలిటీలో జీహెచ్ఎంసీ నిర్మించిన 1548 డబుల్ బెడ్రూం ఇండ్లను గురువారం ప్రారంభించి ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్తో కలిసి పట్టాలు పంపిణీ చేశారు. తూంకుంటలో నిర్మించిన 1548 ఇండ్లలో ముషీరాబాద్ నియోజకవర్గంలో 405, అంబర్పేట్లో 561, సికింద్రాబాద్లో 582మందికి కేటాయించినట్టు తెలిపారు.
ఎన్నికల వస్తున్నాయని జనంలోకి వచ్చి బూటకపు వాగ్దానాలు చేస్తున్న కాంగ్రెస్, బీజేపీలను నమ్మవద్దని, వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం సంగారెడ్డి జిల్లాలోని కొల్లూరులో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీని గాంధీ ప్రారంభించారు. హైదరాబాద్లోని ఎనిమిది నియోజవకర్గాలకు చెందిన 7241 మందికి ఇండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ను మూడోసారి గెలిపించి ఆశీర్వదించాలని కోరారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి పారదర్శకంగా పేదలకు పంపిణీ చేస్తున్నట్టు వివరించారు.
సీఎం కేసీఆర్ చేపట్టిన ప్రతి అభివృద్ధి పథకం చరిత్ర సృష్టించేలా ఉందని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మురహరిపల్లిలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్తో కలిసి గురువారం మంత్రి డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రతిఒక్కరికి సొంతింటికలను సాకరం చేసే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదని తెలిపారు. డబుల్ బెడ్రూం ఇండ్లను అర్హులైన అందరికీ ఇస్తామని, ఆన్లైన్ విధానం ద్వారా ఇంటి ఫ్లోర్ను కేటాయిస్తున్నట్టు పేర్కొన్నారు. ఎలాంటి అవకతవకలు, రాజకీయాలు, పైరవీలకు తావు లేకుండా నిష్పక్షపాతంగా ఎంపిక చేస్తున్నట్టు తెలిపారు. ఇండ్లు పొందిన ప్రతిఒక్కరూ అదృష్టవంతులని.. లిఫ్ట్, నీటి సదుపాయంతో పాటు అన్ని రకాల సౌకర్యాలు ఉన్నట్టు వివరించారు. మురహరిపల్లిలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లు బంజారాహిల్స్, హైటెక్సిటీలో ఉన్న ఇండ్ల కంటే బాగున్నాయని మంత్రి పేర్కొన్నారు.
సంగారెడ్డి జిల్లా కొల్లూరు టౌన్షిప్లో డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో బంజారాహిల్స్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సుపరిపాలనతో కాంగ్రెస్, బీజేపీ నేతలకు నిద్రపట్టడం లేదని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు చూసి ఇతర రాష్ర్టాల సీఎంలు కూడా ఆశ్చర్యపోతున్నట్టు పేర్కొన్నారు. ఎన్నికలు రాగానే కాంగ్రెస్, బీజేపీ నాయకులు అమలు కాని హామీలు ఇస్తూ ప్రజలను తప్పుదోవ పట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు వంద సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల కోసం పనిచేస్తున్న సీఎం కేసీఆర్ను హ్యాట్రిక్ సీఎంగా గెలిపించాలని ప్రజలను కోరారు.
పేదలకు దసరా కానుకగా సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించి ఇచ్చారని, ఇండ్ల నిర్మాణంతో వేలాది మంది పేద, మధ్య తరగతి ప్రజల సొంతింటి స్వప్నం సాకారమైందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. గురువారం మేడ్చల్ నియోజక వర్గంలోని కొర్రెముల (వెంకటాపురం)లో 6 ఎకరాల్లో నిర్మించిన 800 డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించి అక్కడే ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ.. లబ్ధిదారులపై ఒక్క రూపాయి భారం లేకుండా అన్ని రకాల సౌకర్యాలతో ఇండ్లను నిర్మించి ఉచితంగానే ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనని తెలిపారు. పేద, మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను నెరవేర్చాలన్న సీఎం కేసీఆర్ సంకల్పంతోనే ఇది సాధ్యమైందని తెలిపారు.
పేద, మధ్యతరగతి ప్రజల కలలను సాకారం చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశంసించారు. ఉప్పల్ నియోజకవర్గం హెచ్బీ కాలనీ చైతన్యనగర్లో గురువారం ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డితో కలిసి మంత్రి సబిత డబుల్ బెడ్రూం ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల కోసం నిత్యం శ్రమించే సీఎం కేసీఆర్పై ప్రజలకు నమ్మకం, విశ్వాసం ఉన్నాయని పేర్కొన్నారు. సీఎం తప్పకుండా ఇండ్లు నిర్మించి ఇస్తాడనే నమ్మకం, విశ్వాసం ఉండడం వల్లే దరఖాస్తు చేసి ఇన్ని రోజులైనా ప్రజలు రసీదులను జాగ్రత్తగా పెట్టుకున్నారని పేర్కొన్నారు. బిడ్డలకు తండ్రి ఇల్లు కట్టి ఇచ్చినట్టే కేసీఆర్ పేదలకు ఇండ్లు కట్టించి ఇచ్చారని మంత్రి సబిత తెలిపారు.
పెబ్బేరు, అక్టోబర్ 5 : ఎన్నికల ముందు ప్రతిపక్ష నాయకులు చెప్పే మాయమాటలు నమ్మొద్దని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి.. అమలు చేస్తున్న సంక్షేమంతో ప్రజలు సంతోషంగా ఉన్నారని, ప్రజల బాగోగులను పట్టించుకుంటున్న సీఎం కేసీఆర్కు, బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టాలని కోరారు. గురువారం వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలో 28 అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. పెబ్బేరులో 162, గుమ్మడంలో వంద మందికి డబుల్ ఇండ్లు, జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల పట్టాలు అందజేశారు. మంత్రి మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారని తెలిపారు. ఐదేండ్లలో వనపర్తిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని అన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకంతో 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్న ఘనత సీఎం కేసీఆర్దేనని ఆయన కొనియాడారు.
నాగర్కర్నూల్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): డబుల్ బెడ్రూం ఇండ్లు పేదల ఆత్మగౌరవ ప్రతీక అని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. గురువారం పెద్దముద్దునూరులో డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని అన్నారు. ఇప్పటివరకు పేదల సంక్షేమం కోసం ఏ ప్రభుత్వం ఇంతలా కృషి చేయలేదని చెప్పారు. గతంలో పిట్టగూళ్ల లాంటి ఇండ్లు నిర్మించిన కాంగ్రెస్కు భిన్నంగా సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాన్ని తీసుకొచ్చారని తెలిపారు. పేదలందరికీ సొంతిల్లు ఉండాలనేదే సీఎం కేసీఆర్ లక్ష్యమని చెప్పారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనని డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ అన్నారు. గురువారం నాగారం మున్సిపాలిటీ రాంపల్లిలో మూడోవిడత 2845 డబుల్ బెడ్రూం ఇండ్లను ఉప్పల్, అంబర్పేట్, యాకత్పురా అసెంబ్లీ నియోజకవర్గాల నిరుపేద లబ్ధిదారులకు అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధునాతన సౌకర్యాలతో డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేయడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే 70 వేల ఇండ్లను పూర్తిచేసి పేదలకు అందించినట్టు తెలిపారు.