నారాయణపేట : జిల్లా కేంద్రంలోని స్కిల్ సెంటర్లో రోటరీ క్లబ్ లేక్ డిస్ట్రిక్ మొయినాబాద్, అరబిందో ఫార్మా వారి ఆధ్వర్యంలో 800 సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ డీజీపీ, ప్రభుత్వ సలహాదారు అనురాగ్ శర్మ, అరబిందో ఫార్మా చైర్మన్ రఘునాథ్ కన్న, కలెక్టర్ హరిచందన, ఎస్పీ ఎన్.వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే ఎస్.రాజేందర్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా అనురాగ్ శర్మ మాట్లాడుతూ.. గత ఏడాది నారాయణపేట జిల్లా కేంద్రంలో జాతీయ జెండా ఎగరవేయడానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సమయంలో జిల్లా వెనుకబాటు తనాన్ని గుర్తించామన్నారు. ఆ రోజే నారాయణపేట జిల్లాకు ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు.
ఈ విషయాన్ని అరబిందో ఫార్మా చైర్మన్, మొయినాబాద్ రోటరీ క్లబ్ దృష్టికి తీసుకెళ్లామని ఆయన పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థినులు పాఠశాలకు వెళ్లడానికి పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వారికి సైకిళ్లను అందించాలని నిర్ణయించడం ఎంతో మంచి నిర్ణయమన్నారు.
సైకిళ్లను అందించడానికి ముందుకు వచ్చిన అరబిందో చైర్మన్ కు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. బాగా చదివి ఉన్నత శిఖరాలకు చేరుకొని జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని అనురాగ్ శర్మ ఆకాంక్షించారు.