హైదరాబాద్, జనవరి31 (నమస్తే తెలంగాణ): జనగామ, ఆలేరు, దమ్మాయిగూడ, సదాశివపేట, అందోల్-జోగిపేట, జవహర్నగర్ తదితర మున్సిపల్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానాల వ్యవహారాల్లో జోక్యం చేసుకొనేందుకు హైకోర్టు నిరాకరించింది. అవిశ్వాస తీర్మానాలపై సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన అప్పీళ్లను సీజే జస్టిస్ అలోక్ అరధే, జస్టిస్ అనిల్కుమార్తో కూడిన ధర్మాసనం బుధవారం కొట్టివేసింది. అవిశ్వాస తీర్మానాలపై జోక్యం చేసుకునేందుకు సింగిల్ జడ్జి నిరాకరించడాన్ని కొందరు మున్సిపల్ చైర్మన్లు అప్పీళ్లు దాఖలు చేశారు. వారి తరఫు సీనియర్ న్యాయవాది కే వివేక్రెడ్డి, మయూర్రెడ్డి వాదిస్తూ, రాష్ట్ర మున్సిపల్ చట్టం-2019 సెక్షన్ 37లో అవిశ్వాస తీర్మానం ఆమోదించడానికి విధివిధానాలు లేవని తెలిపారు. వాదనల తర్వాత సింగిల్ జడ్జి ఉత్తర్వులపై జోక్యం చేసుకునేందుకు నిరాకరిస్తూ అప్పీళ్లను హైకోర్టు కొట్టివేసింది.