Insulin imbalance | మానవ శరీరంలో ఇన్సులిన్ సమతుల్యత దెబ్బతినడంతోనే రోగాలు చుట్టూ ముడుతాయని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కార్డియో థోరాసిక్ సర్జరీ విభాగం మాజీ ప్రొఫెసర్ డాక్టర్ పీవీ సత్యనారాయణ తెలిపారు. హైదరాబాద్ ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ‘దీర్ఘకాలిక వ్యాధులు- ఆహార నియమాలు’ తదితర అంశాలపై ఆయన అవగాహన కల్పించారు. జబ్బులకు ప్రధానమైనది ఆహార నియమాలు పాటించకపోడమేనని, స్థూలకాయంతో పాటు రోగాలు సైతం పెరుగుతూ వస్తాయన్నారు.
ఏడు దశాబ్దాల కాలంలో ప్రపంచవ్యాప్తంగా స్థూలకాయులు పెరిగారని, ఆ ఫలితంగానే మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్లాంటివి పెరుగుతున్నాయన్నారు. 2025 నాటికి 1.5 బిలియన్ల మంది రక్తపోటు బాధితులుగా మారుతారన్నారు. 422.7 మిలియన్ల మంది గుండెజబ్బుల బారిన పడతారని, ప్రతి 36 సెకండ్లకు ఓ అమెరికన్ గుండెపోటుతో చనిపోతున్నాడని తెలిపారు. ప్రస్తుతం 425 మిలియన్ల మంది మధుమేహ వ్యాధిగ్రస్తులుంటే 2045 నాటికి 629 మిలియన్లకు చేరుకుంటుందన్నారు. క్యాన్సర్ వ్యాధికి ప్రధానమైనది స్థూలకాయమేనని అధ్యయనాల్లో వెల్లడైందని, యూఎస్లో రోజు 1600 మంది, చైనాలో 8వేల మంది క్యాన్సర్తో మరణిస్తున్నారని చెప్పారు.
ప్రస్తుతం ప్రతి ముగ్గురిలో ఒకరు ఈ వ్యాధిబారిన పడుతున్నారన్నారు. శరీరంలో ఇన్సులిన్ శాతానికి మెరుగుపర్చుకుంటే రోగాలు దరిచేరవన్నారు. పిండి పదార్థాలను తగ్గించి ప్రొటీన్లు తీసుకోవడం అలవర్చుకోవాలని, పచ్చని ఆకుకూరలు, మాంసకృతులు తీసుకోవాలని, ఆహార నియమాలు పాటిస్తే ఏడుపదుల వయస్సు వచ్చినా ఎలాంటి జబ్బులు రావన్నారు. అనంతరం ప్రెస్క్లబ్ అధ్యక్షుడు ఎల్. వేణుగోపాల నాయుడు, కార్యవర్గ సభ్యురాలు పద్మావతి డాక్టర్ సత్యనారాయణను శాలువతో సత్కరించారు.