Telangana | హైదరాబాద్ : టీఎస్ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావుతో విద్యుత్ ఉద్యోగుల చర్చలు సఫలమయ్యాయి. 7 శాతం పీఆర్సీకి విద్యుత్ ఉద్యోగులు అంగీకరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి, సీఎండీ ప్రభాకర్ రావుకు విద్యుత్ ఉద్యోగులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ నెల 17 నుంచి తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీఎస్పీఈ జాక్) తలపెట్టిన సమ్మె విషయంలో తెలంగాణ లేబర్ కమిషనర్ జోక్యం చేసుకుని, సయోధ్య కుదుర్చాలని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు కోరిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 7వ తేదీన లేబర్ కమిషనర్కు ప్రభాకర్ రావు లేఖ రాశారు. టీఎస్పీఈ జాక్తో ఇప్పటికే ఐదుసార్లు చర్చలు జరిపామని, విద్యుత్తు సంస్థల ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని 6 శాతం ఫిట్మెంట్కు ప్రతిపాదించామని వివరించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో శనివారం జరిగిన చర్చలు విజయవంతమయ్యాయి. 7 శాతం పీఆర్సీకి విద్యుత్ ఉద్యోగులు అంగీకరించారు. దీంతో రేపట్నుంచి తలపెట్టిన సమ్మె విరమించుకున్నారు.