హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): తమిళనాడులో తెలంగాణ రైతు పథకాలపై ప్రధానంగా చర్చ జరిగింది. ఆదివారం కాంచీపురంలో వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో రైతులు, వ్యాపారులు తెలంగాణ పథకాలపై ప్రముఖంగా చర్చించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం రైతుబీమా, రైతుబంధు, ఉచిత విద్యుత్తు పథకాలతోపాటు నీటిపారుదల వ్యవస్థను బలోపేతం చేసినట్టు తెలంగాణకు చెందిన దక్షిణ భారత రైతు సంఘాల ఫెడరేషన్ అధ్యక్షుడు కోటపాటి నరసింహనాయుడు తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఆ రాష్ట్ర చిన్న పరిశ్రమలశాఖ మంత్రి అన్వాబర సన్, పౌరసరఫరాలశాఖ మంత్రి చక్రి.. తెలంగాణ మాడల్ పథకాలు తమిళనాడులోనూ అమలుకు ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు.