హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): ఆయుష్మాన్ భారత్ పథకం కింద తెలంగాణకు కేంద్రం కేటాయిస్తున్న నిధులు అరకొరగా ఉంటున్నాయని బీఆర్ఎన్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు పేరొన్నారు. ఈ విషయమై గురువారం ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్ర వైద్య అవసరాలకు తగ్గట్టు కేంద్రం నుంచి నిధుల కేటాయింపులు ఉండటం లేదని చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాలతో సమానంగా కేటాయింపులు జరగడం లేదని పేర్కొన్నారు. కేంద్రం సహకరించకున్నా.. సీఎం కేసీఆర్ వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, దేశంలోనే తెలంగాణ వైద్యరంగాన్ని మేటిగా నిలిపారని వెల్లడించారు. ఆయుష్మాన్ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ అనుమతితో ఏడీబీ వంటి ఆర్థిక సంస్థల నుంచి పెద్ద ఎత్తున రుణాలను తీసుకొంటున్నదని, కానీ.. తెలంగాణ పట్ల తీవ్ర వివక్ష చూపుతున్నదని మండిపడ్డారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా రూ.584.04 కోట్ల నిధులు విడుదల చేసిన కేంద్రం.. తెలంగాణకు కేవలం రూ.11.25 కోట్లు మాత్రమే కేటాయించిందని చెప్పారు. అలాగే 2022- 23 ఆర్థిక సంవత్సరంలో రూ.4176.84 కోట్లు కేటాయించిన కేంద్రం.. తెలంగాణకు రూ. 102.91 కోట్లే నిధులు ఇచ్చిందని అన్నారు. గుజరాత్ రాష్ట్రానికి 2022-23 ఆర్థిక సంవత్సరంలో 118.30 కోట్లు, జార్ఖండ్కు రూ. 240.16 కోట్లు, మహారాష్ట్రకు రూ.130.79 కోట్లు, ఉత్తరప్రదేశ్కు రూ. 650.23 కోట్లు కేటాయించారని వివరించారు. మిగతా రాష్ట్రాలతో పోల్చుకొంటే తెలంగాణకు కేటాయింపులు దారుణంగా ఉన్నాయని మండిపడ్డారు.
ఎంపీ నామాకు మాదిగ జేఏసీ కృతజ్ఞతలు
ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించిన బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పక్షనేత నామా నాగేశ్వరరావుకు మాదిగ జేఏసీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది. ఇటీవలే ఎంపీ నామాను కలిసి వర్గీకరణను పార్లమెంట్ దృష్టికి తేవాలని కోరినట్టు జేఏసీ రాష్ట్ర కన్వీనర్ కొడారి ధీరన్, ప్రచార కార్యదర్శి గద్దల నాగేశ్వరరావు తెలిపారు. తమకు ఇచ్చిన హామీని ఎంపీ నామా నెరవేర్చినందుకు వారు హర్షం వ్యక్తం చేశారు.