e Challan | హైదరాబాద్ : రాష్ట్రంలోని వాహనదారులకు పోలీసు శాఖ పెండింగ్ చలాన్లు తక్షణమే చెల్లించేందుకు బంపర్ ఆఫర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు వాహనాల పెండింగ్ చలాన్లు రాయితీపై చెల్లింపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ ఇస్తూ రవాణా శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. నేటి నుంచి జనవరి 10వ తేదీ వరకు పెండింగ్ చలాన్లను చెల్లించేందుకు అవకాశం కల్పించారు.
ద్విచక్ర వాహనాలు, ఆటోలకు 80 శాతం, ఫోర్ వీలర్లు, లారీలు వంటి ఇతర భారీ వాహనాలకు 60 శాతం, ఆర్టీసీ బస్సులకు 90 శాతం రాయితీ ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.2 కోట్ల పైగా చలాన్లు పెండింగ్లో ఉండటంతో పోలీసు శాఖ ఈ నిర్ణయం తీసుకొన్నది.
గత ఏడాది ఇలాగే రాయితీ ప్రకటించడంతో 45 రోజుల వ్యవధిలోనే ఏకంగా రూ.300 కోట్ల వరకు చలాన్ల రుసుము వసూలైంది. ఇదే తరహాలో మరోమారు రాయితీలు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. హైదరాబాద్ నగరంలోని మూడు కమిషనరేట్లతోపాటు రాష్ట్రంలోని ఇతర కమిషనరేట్లు, జిల్లా ప్రధాన కార్యాలయాలు మొదలు చిన్న పట్టణాల్లోనూ చలానాలు విధిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం, ఎకడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో ఉల్లంఘనలకు పాల్పడేవారిని గుర్తించి చలానాలు విధిస్తున్నారు. గత నెలాఖరు నాటికి పెండింగ్ చలాన్ల సంఖ్య మళ్లీ రూ.2 కోట్లకు చేరుకోవడంతో మరోమారు రాయితీ ప్రకటించారు. నిర్ణీత వ్యవధిలో చలానాలాను చెల్లించేవారికే ఈ రాయితీ వర్తిస్తుందని తెలిపారు.