హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్లో పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి చేపట్టిన ‘స్పెషల్ డ్రైవ్’ ను ప్రభుత్వం నిలిపివేయడంపై రైతుల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి. రైతు భరోసా పేరిట అందించే పెట్టుబడి సాయం నుంచి తప్పించుకునేందుకే ఇలా చేసింద న్న విమర్శలు వస్తున్నాయి.మొత్తం 2.45 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వీటిని పరిష్కరిస్తే దాదాపు 2లక్షల ఎకరాలకు అదనంగా రైతుభరోసా వేయాల్సి వస్తుందని అధికారులు అంచనా వేసినట్టు తెలిసింది. ఎకరాకు రూ.7,500 చొప్పున దాదాపు రూ.150 కోట్లు అదనపు భారం పడుతుందని తేల్చినట్టు సమాచారం. ఎన్నికల సమయంలో దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ అని ఆశ పెట్టి ఇప్పుడు ఎన్నికల కోడ్ను బూచిగా చూపి రైతు భరోసాను ప్రభుత్వం ఎగ్గొట్టే ప్రయత్నాలు చేస్తున్నదని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగిపోయిన రైతులు, సోమవారంతో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కూడా ముగుస్తున్న నేపథ్యంలో ప్రభు త్వం ప్రత్యేక అనుమతి తీసుకొని పరిష్కరిస్తుందా? అని ఎదురుచూస్తున్నారు.
‘ఆన్గోయింగ్’ను ఎందుకు ఆపేశారు?
మార్చి 1 నుంచి ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ ప్రారంభించింది. పెండింగ్ దరఖాస్తులను తొమ్మిది రోజుల్లోగా పరిష్కరిస్తామని ఆర్భాటంగా ప్రకటించింది. దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, నివేదిక వచ్చిన తర్వాత రికార్డుల్లో మార్పులు, చేర్పులు చేసే అధికారాన్ని తాసిల్దార్లకు అప్పగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కానీ పోర్టల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో ఇదంతా తూతూమంత్రం వ్యవహారమని నిపుణులు పెదవి విరిచారు. దానికి తగ్గట్టే ప్రభుత్వం రెండు వారాలపాటు స్పెషల్ డ్రైవ్ కొనసాగించి, ఎన్నికల కోడ్ పేరుతో దరఖాస్తుల పరిశీలన ఆపేసింది. రెండు వారాల్లో ఒక్క దరఖాస్తును కూడా పరిష్కరించలేదు. వాస్తవానికి ధరణిలో పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం అనేది మొదటి నుంచీ ఉన్న ప్రక్రియ. పోర్టల్ ప్రారంభమైన కొన్ని రోజులకే గ్రీవెన్స్ మాడ్యూల్స్ అందుబాటులోకి వచ్చాయి. అధికారులు దరఖాస్తులను పరిశీలించి వాటిని పరిష్కరిస్తున్నారు. కాబట్టి ఇది ‘ఆన్గోయింగ్’ కార్యక్రమం కిందే లెక్కని నిపుణులు వాదిస్తున్నారు. రెవెన్యూ అధికారులు వినకుండా ‘కోడ్’ పేరుతో దరఖాస్తుల పరిశీలన నిలిపివేశారు. ఇటీవల రెవెన్యూ ఉన్నతాధికారులతో ధరణి కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. ఇదే విషయంపై కొంత వాగ్వాదం జరగగా.. మాకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయి’ అని అధికారులు చెప్పినట్టు సమాచారం.
ఈసీని ఎందుకు అడగరు?
ప్రభుత్వానికి రైతులపై ప్రేమ ఉంటే స్పెషల్డ్రైవ్కు మినహాయింపు ఇవ్వాలని ఈసీకి ఎందుకు లేఖ రాయలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోలింగ్ ముగిసిన తర్వాతైనా ఎందుకు అనుమతి తీసుకోవడం లేద ని రైతులు మండిపడుతున్నారు. జూన్ 4న ఎన్నికల కోడ్ ముగిసినా స్పెషల్డ్రైవ్ మొదలుపెట్టే పరిస్థితి లేదని అధికారులు చెబుతున్నాయి. పెండింగ్ దరఖాస్తులు పరిష్కరిస్తే పెట్టుబడి సాయం తడిసి మోపెడవుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికీ యాసంగి రైతుబంధు పంపిణీయే పూర్తి కాలేదు. ఈ సమయంలో జూన్ చివరి వారం నుంచి వానకాలం పెట్టుబడి సాయం పంపిణీ సాధ్యం కాదు. వీలైనంత ఎక్కువ కాలం దరఖాస్తులు పెండింగ్లో ఉంచాలని సర్కారు భావిస్తున్నట్టు సమాచారం. జూన్ చివరివారంలో ‘స్థానిక సంస్థల’ ఎన్నికలకు వెళ్తామని ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి మరో రెండు మూడు నెలలు ‘కోడ్’ పేరిట కాలయాపన చేసే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.