హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : ఒమిక్రాన్ వేరియంట్ సోకి చికిత్సపొందిన 10 మంది శుక్రవారం డిశ్చార్జి అయ్యారు. దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్ యాక్టివ్ కేసుల సంఖ్య 28కి తగ్గింది. వరుసగా రెండోరోజు కూడా కొత్త కేసులు నమోదుకాలేదు. శుక్రవారం రిస్క్ దేశాల నుంచి వచ్చిన 883 మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి పాజిటివ్ వచ్చింది. రాష్ట్రంలో శుక్రవారం కొత్తగా 162 కరోనా కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 81, రంగారెడ్డిలో 24, హనుమకొండలో 10 కేసులు నిర్ధారణ అయ్యాయి. 210 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 3,547 మంది ఇండ్లు, దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు.
‘గూడెం‘లో సెల్ఫ్ లాక్డౌన్
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామప్రజలు సెల్ఫ్ లాక్డౌన్ విధించుకొన్నారు. ఈ నెల 16న దుబాయి నుంచి వచ్చిన గ్రామస్థుడికి ఒమిక్రాన్ నిర్ధారణ కావడం.. అతని తల్లీ, భార్యకు ఆర్టీపీసీఆర్ పాజిటివ్ రావడంతో ఈ నెల 23 నుంచి వచ్చే నెల 2 వరకు గ్రామంలో లాక్డౌన్ ప్రకటించారు.