హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ‘ప్రధానమంత్రి విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ పథకం’ ద్వారా చేతివృత్తిదారులకు 5% తక్కువ వడ్డీతో లక్ష వరకు రుణాలు అందజేయనున్నట్టు ఎంఎస్ఎంఈ మంత్రిత్వశాఖ అధికారి చంద్రశేఖర్ తెలిపారు. హైదరాబాద్, వరంగల్ నగరాల్లో 17న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు పేర్కొన్నారు. హైదరాదాద్లో ఎంఎస్ఎంఈ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో మూడురోజుల పాటు నిర్వహించే ‘ఇండస్ట్రియల్ అండ్ ఇండెక్స్ ఎక్స్పో’ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హస్తకళాకారులు, చేతివృత్తిదారులకు రుణాలు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. 17న రుణాల పంపిణీని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. దేశమంతటా ఈ పథకం కింద దాదాపు మూడు లక్షల మంది చేతివృత్తి కళాకారులకు లబ్ధి చేకూరనున్నదని తెలిపారు.