హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పింఛన్ను మరో రూ.వెయ్యి పెంచడంతో రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు మిన్నంటాయి. దివ్యాంగుల పింఛన్ను వచ్చె నెల నుంచి మరో వెయ్యి పెంచి ఇస్తామని సీఎం కేసీఆర్ శుక్రవారం మంచిర్యాలలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబురాలు చేసుకొని, ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సీఎం కేసీఆర్ దివ్యాంగుల పాలిట వెలుగు దివ్వెగా మారారని ఆనందం వ్యక్తంచేశారు.
సిద్దిపేటలో మంత్రి హరీశ్రావు, మహబూబ్నగర్లో మంత్రి శ్రీనివాస్గౌడ్ దివ్యాంగులతో కలిసి సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దివ్యాంగులు భారీ ర్యాలీ నిర్వహించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కేక్కట్ చేసి సంబురాలు చేసుకొన్నారు. మలక్పేటలోని వికలాంగుల సంక్షేమ భవన్లో రాష్ట్ర సలహామండలి సభ్యులు నాగేశ్వర్రావు, శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి దివ్యాంగులు క్షీరాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా వాసుదేవరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని దివ్యాంగుల పాలిట సీఎం కేసీఆర్ వెలుగు దివ్వె అయ్యారని, కేసీఆర్ మానవీయ పాలనకు పింఛన్ పెంపే నిదర్శనమని కొనియాడారు. దివ్యాంగుల అవసరాలు తెలుసుకొని దేశంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టని విధంగా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5,16,890 మందికి నెలకు రూ.3,016 పింఛన్ ఇస్తున్నారని చెప్పారు. తద్వారా ఏటా రూ.1800 కోట్లు ఖర్చవుతున్నదని, తాజా పెంపుతో ప్రభుత్వానికి ఏటా రూ.600 కోట్ల అదనపు భారం పడనున్నదని వివరించారు. రాష్ట్రంలోని ప్రతి దివ్యాంగుడు సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటారని పేర్కొన్నారు. దేశంలో ఇంత పెద్ద మొత్తం పింఛన్ అందిస్తున్న రాష్ట్రం మరొకటి లేదని, నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లోనూ దివ్యాంగుల పింఛన్ కేవలం రూ.1,000 మాత్రమేనని వెల్లడించారు. కార్యక్రమంలో దివ్యాంగుల సంఘాల నాయకులు మున్న, రాజ్యలక్ష్మి, అంధుల ప్రతినిధులు భాసర్, మహేందర్, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ సల్లంగ ఉండాలి
ములుగు, జూన్ 10 (నమస్తే తెలంగాణ): ములుగుకు చెందిన సుభద్ర, దూడబోయిన కొమురెల్లి దంపతుల కూతురు విఘ్నేశ్వరి. ఈమె పుట్టిన మూడేండ్లకే కొమురెల్లి మరణించాడు. భర్త లేకపోవడం, బిడ్డ దివ్యాంగురాలు కావడంతో రూ.1,500 దివ్యాంగ పింఛన్తో నెట్టుకొచ్చిన సుభద్రకు ప్రస్తుతం వితంతు పింఛన్ కింద రూ.2,116 వస్తుండగా కూతురికి దివ్యాంగ పింఛన్ రూ.3,016 వస్తుంది. తాజాగా దివ్యాంగులకు వెయ్యి రూపాయల పింఛన్ పెంచడంతో సుభద్ర సీఎం కేసీఆర్పై ప్రశంసలు కురిపించింది. కేసీఆర్ సల్లంగా ఉండాలని ఆశీర్వదించింది.
నా బతుకుకు ఢోకా లేదు
బాన్సువాడ టౌన్, జూన్ 10: నిజామాబాద్ జిల్లా బాన్సువాడకు చెందిన దివ్యాంగురాలు దొన్కంటి లక్ష్మి మాటలు రాకపోయినా పేపర్పై రాసి తన మనోగతాన్ని వెల్లడించింది. ‘నేను పుట్టు మూగ, చెవుడు. ఆడపిల్ల అంగవైకల్యంతో పుట్టడం చాలా ఇబ్బందికరం. సొంతవాళ్లు కూడా చిన్న చూపు చూసేవాళ్లు. ఇంట్లో వాళ్లను ఏదైనా వ్యక్తిగత అవసరాల కోసం డబ్బులు అడగాలనుకున్నా పరిస్థితులు ఇబ్బందిగా ఉండేవి. రూ.500 ఉన్న పింఛన్ తెలంగాణ వచ్చిన తర్వాత రూ.1,500కు పెంచడంతో మా బాధలు తగ్గాయి. 2019లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాక పింఛన్ డబ్బులను రూ.3,016కు పెంచిండు. దీంతో ఒకరిపై ఆధారపడటం పోయి.. మా పైనే ఇంకొకరు ఆధారపడే పరిస్థితులు వచ్చాయి. మంచిర్యాలలో కేసీఆర్ సార్ మాకు ఇస్తున్న పింఛన్ను ఇంకో వెయ్యి రూపాయలు పెంచడంతో మా ఆనందానికి అవధులు లేవు. కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటాం’ అని లక్ష్మి వెల్లడించింది.