హైదరాబాద్, మార్చి 24 (నమస్తేతెలంగాణ): దివ్యాంగుల పింఛన్ రూ.6 వేలకు పెంచుతామని అసెంబ్లీ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ దగా చేసింది. వారి పింఛన్ సొమ్ము పెంచేదాకా సర్కార్ను వదలబోము. వారికిచ్చిన ఇతర హామీలన్నింటినీ నెరవేర్చేదాకా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. అసెంబ్లీ బయట దివ్యాంగుల కార్పొరేషన్ రాష్ట్ర మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి ఆధ్వర్యంలో పలువురు దివ్యాంగులు కేటీఆర్ను కలిశారు. వినతిపత్రం అందజేసి కాంగ్రెస్ సర్కార్ చేసిన మోసాలను వివరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో దివ్యాంగుల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశామని చెప్పారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, సంక్షేమ పథకాల కేటాయింపులో ప్రత్యేక కోటా వర్తింపజేశామని గుర్తుచేశారు. కానీ, దివ్యాంగులకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని, బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తామని కాంగ్రెస్ హామీలిచ్చి ఓట్లను కొల్లగొట్టిందని తెలిపారు. గద్దెనెక్కి రెండున్నరేండ్లు అవుతున్నా పట్టించుకోవడంలేదని విమర్శించారు. గోడు వెళ్లబోసుకొనేందుకు వచ్చిన వారిని అసెంబ్లీలోకి అనుమతించక పోవడంతో రోడ్డుపైనే వారిని కలిసి వినతిపత్రం తీసుకొన్నామని చెప్పారు. దివ్యాంగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా అసెంబ్లీ లోపల, బయట పోరాటం చేస్తామని వారికి భరోసా ఇచ్చారు. బుధవారం ఇందిరాపార్క్ వద్ద చేపట్టనున్న దివ్యాంగుల నిరసన దీక్షకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని కేటీఆర్ ప్రకటించారు.
ప్రశ్నించే గొంతులపై కాంగ్రెస్ కత్తి
ప్రశ్నించే గొంతులను నొక్కుతూ కాంగ్రెస్ సర్కార్ కక్ష సాధిస్తుందని కేటీఆర్ మండిపడ్డారు. పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని, రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ఎప్పుడని, పింఛన్లు ఎప్పుడు పెంచుతారని ప్రశ్నించిన విద్యార్థులు, నిరుద్యోగులు, దివ్యాంగుల గొంతులు నొక్కుతుందని ధ్వజమెత్తారు. హామీలు అమలు చేయాలని అసెంబ్లీ ముట్టడికి యత్నించిన బీఆర్ఎస్వీ నాయకుల అరెస్ట్ దుర్మార్గమని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలన ఎమర్జెన్సీని తలపిస్తున్నదని ఆరోపించారు. 127 మంది గురుకుల విద్యార్థులు మరణించినా సీఎం రేవంత్రెడ్డికి చీమకుట్టినట్టయినా లేదని, కనీసం దీనిపై ఇంతవరకు స్పందించిన పాపాన పోలేదని దుయ్యబట్టారు. పిల్లల భవిష్యత్తుపై వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు. స్కాలర్షిప్, ఫీజు బకాయిలు విడుదల చేయాలని, అరెస్ట్ చేసిన బీఆర్ఎస్వీ నాయకులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు