మన్సూరాబాద్, నవంబర్ 22: భూవిజ్ఞాన శాస్త్రం, గనులు, పర్యావరణ, పట్టణ ప్రణాళికా విభాగాల్లో అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకొని జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి యువ సైంటిస్టులకు శిక్షణా తరగతులు ఉపయోగపడతాయని జీఎస్ఐ టీఐ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, హెడ్ మిషన్-5 సీహెచ్ వెంకటేశ్వరరావు చెప్పారు.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ (ఐటీఈసీ)లో భాగంగా ఎల్బీనగర్, నాగోల్, బండ్లగూడలోని జీఎస్ఐ టీఐ కార్యాలయంలో జియో సైంటిస్ట్ల కోసం రిమోట్ సెన్సింగ్, డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్ 12వ అంతర్జాతీయ కోర్సును ఆయన ప్రారంభించారు. 15 ఐటీఈసీ దేశాల నుంచి 15 మంది యువ సైంటిస్టులు ఈ కోర్సును అభ్యసించడానికి వచ్చారని తెలిపారు. డిసెంబర్ 22 వరకు శిక్షణా తరగతులు జరుగుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో జీఎస్ఐ టీఐ డీడీజీ డాక్టర్ మాథ్యూ జోసెఫ్, టెక్నికల్ కోఆర్డినేషన్ డైరెక్టర్ భుటియా, కోర్సు కోఆర్డినేటర్ డైరెక్టర్ డాక్టర్ నిషారాణి, డైరెక్టర్ బిబాస్ సేన్, డైరెక్టర్ విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.