హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లకు దరఖాస్తు చేసుకొనేందుకు సీబీఎస్ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్), ఐసీఎస్ఈ (ఇండియన్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దరఖాస్తుల స్వీకరణ పూర్తిస్థాయిలో కాకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ ఏటా ఇదే సమస్య ఉత్పన్నమవుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రీమెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల కోసం విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అందుకు తుది గడువు ఈ నెల 31న ముగియనున్నది. అయితే, పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్ల దరఖాస్తుల స్వీకరణ విజయవంతం కావడం లేదు. దాంతో విద్యార్థులు బీసీ, ఎస్సీ, మైనార్టీ, ఎస్టీ సంక్షేమశాఖ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
ఆ విద్యార్థుల డాటా లేదు
పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల కోసం ఈపాస్ వెబ్సైట్ ద్వారా విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉన్నది. అందుకు తొలుత విద్యార్థులు తమ పదో తరగతి హాల్ టికెట్ నంబర్ను ప్రధానంగా ఎంట్రీ చేయాలి. ఆ తరువాతనే మిగతా వివరాలంటే ఆధార్, బ్యాంక్ అకౌంట్, స్టడీ సర్టిఫికెట్ల అప్లోడ్కు సంబంధించిన ఆప్షన్స్ సైట్లో డిస్ప్లే అవుతాయి. అప్పుడే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. ఇక్కడే అసలు సమస్య ఎదురవుతున్నది. తెలంగాణ రాష్ట్ర సెంకడరీ బోర్డు ఎడ్యుకేషన్ ద్వారా పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు హాల్టికెట్ నంబర్ ఎంటర్ చేయగానే వివరాలన్నీ సైట్లో డిస్ప్లే అవుతున్నాయి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సజావుగానే కొనసాగుతున్నది.
కానీ, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ ద్వారా పదోతరగతి పూర్తి చేసిన విద్యార్థులు మాత్రం స్కాలర్షిప్లకు రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోతున్నారు. వీరు పదోతరగతి హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసినా వివరాలు సైట్లో రావడం లేదు. రిజిస్ట్రేషన్ అక్కడితోనే ఆగిపోతున్నది. విద్యార్థులు స్కాలర్షిప్లకు రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోతున్నారు. ఇదే విషయమై సంక్షేమ అధికారులను సంప్రదించగా.. తెలంగాణ బోర్డ్కు సంబంధించిన డాటా మాత్రమే తమ వద్ద ఉన్నదని తెలిపారు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పదో తరగతి డాటా తమ వద్ద లేదని చెప్పారు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ విద్యార్థులు తమ పదో తరగతి మెమోను తీసుకొని జిల్లా సంక్షేమశాఖ అధికారులను సంప్రదించాలని, అక్కడ వారు దానిని అథెంటికేషన్ చేస్తారని, తద్వారా పోస్టుమెట్రిక్ స్కాలర్షిప్లకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు.
ఏటా ఇదే సమస్య
ఇదిలావుండగా, పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్లకు సంబంధించి ప్రతీ సంవత్సరం ఇదే రకమైన సమస్య తలెత్తుతున్నదని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. అయినప్పటికీ సంక్షేమశాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని, సమస్యకు శాశ్వత పరిష్కార మార్గం చూపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవగాహన రాహిత్యంతో, చెప్పేవారు లేక అనేక మంది విద్యార్థులు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ విద్యార్థులు స్కాలర్షిప్లకు దూరమవుతున్నారని వివరించారు. ఇక జిల్లా సంక్షేమశాఖ అధికారులను సంప్రదించినా త్వరితగతిన అథెంటికేషన్ను పూర్తి చేయడం లేదని, ఒకటికి పదిసార్లు కార్యాలయాల చుట్టూ తిప్పించుకొంటున్నారని తెలిపారు. ఇకనైనా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.