మామిళ్లగూడెం, మే 2: పొరుగూరు నుంచి వచ్చిన ఓ వివాహితను కిడ్నాప్ చేసిన దుండగులు.. ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అపస్మారక స్థితికి చేరుకోవడంతో ఆమెను ఖమ్మం ప్రభుత్వ దవాఖానలో వదిలేసి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మహిళ మృతిచెందింది. ఈ ఘటన మంగళవారం సాయంత్రం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు ఇలా.. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం రామన్నగుట్ట తండాకు చెందిన నీల(45).. తన అత్తతో కలిసి వైద్యం కోసం ఏప్రిల్ 27న ఖమ్మం నగరానికి వచ్చింది.
వైద్య పరీక్షల అనంతరం తిరుగు ప్రయాణంలో ఆటోలో వెళ్తుండగా దుండగులు నీలను కిడ్నాప్ చేశారు. ఆ రాత్రంతా ఆమెను చిత్రహింసలకు గురిచేశారు. మరుసటి రోజు 28న ఉదయం 10 గంటల సమయంలో తీవ్ర గాయాలతోపాటు అపస్మారక స్థితిలో ఉన్న నీలను ఖమ్మం ప్రభుత్వ దవాఖానలో చేర్పించి వెళ్లిపోయారు. చికిత్స పొందుతున్న మహిళ అదేరోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో మృతిచెందినట్టు వైద్యులు ప్రకటించి.. బంధువుల కోసం వాకబు చేశారు. అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో గుర్తుతెలియని మృతదేహంగా మార్చురీలో భద్రపరిచారు. కేసు దర్యాప్తులో ఉన్నదని ఖమ్మం పట్టణ ఏసీపీ పీవీ గణేశ్ తెలిపారు.