హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): ఔషధ గుణాలున్న వేపచెట్టును రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని పర్యావరణ, వృక్ష శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వేపచెట్లకు సోకుతున్న చీడపీడలపై ఇటీవల అపోహలు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పర్యావరణ, వృక్ష నిపుణులు సదాశివయ్య, పద్మయ్య బుధవారం మీడియాకు పలు విషయాలను వెల్లడించారు. రాష్ట్రంలో ఇటీవల వేపచెట్లు ఎండిపోవడంపై సోషల్మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని చెప్పారు. వేపచెట్లకు వచ్చిన డై బ్యాక్ డిసీజ్ కొత్తదేమి కాదని, టీ మస్కిటో బగ్ కారణంగా ఈ ఫంగస్ సోకుతుందని వివరించారు. వేపచెట్లకు సోకిన ఫంగస్ ప్రజలకు, జంతువులకు ఎలాంటి హాని చేయదని చెప్పారు. చెట్టులోని ఏ కొమ్మకు ఫంగస్ సోకుతుందో ఆ కొమ్మను మాత్రమే తొలగించాలని సూచించారు. సేంద్రియ వ్యవసాయంలో, ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగించే వేపచెట్లను అనవసరంగా కొట్టివేయవద్దని నిపుణులు తెలిపారు.