TGPSC | హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): టీజీపీఎస్సీ గ్రూప్1 పోస్టులను కాంగ్రెస్ నేతలు అమ్ముకున్నారా? పోస్టుకో రేటు చొప్పున బేరం పెట్టారా? తస్మదీయుల కోసం ఎంతకైనా తెగించారా? అంటే నిరుద్యోగ జేఏసీ నేతలు అవుననే చెప్తున్నారు. టాపర్లలో పలువురు కాంగ్రెస్ నేతల కుటుంబ సభ్యులు ఉన్నారని వారు పలు ఆధారాలను చూపుతున్నారు. రెండు పరీక్ష కేంద్రాల నుంచే 74 మంది టాపర్లు ఉండటం, ఒకే గదిలో రాసిన వారికి, పక్క పక్క బెంచీలు, వెనుక బెంచీల్లోని వారికి అత్యధిక మార్కులు రావడం వెనుక భారీ కుట్రదాగి ఉన్నదని నిరుద్యోగ జేఏసీ నేతలు జనార్దన్, మోతీలాల్ నాయక్ తదితరులు విమర్శిస్తున్నారు.
గూప్-1లో వెలుగులోకి వచ్చిన ఒక్కొక్క లోపాన్ని నిరుద్యోగ అభ్యర్థులు, ప్రజాసంఘాల నేతలు ఎత్తిచూపినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదని, తమ సందేహాలను ఎందుకు నివృత్తి చేయలేదని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. గ్రూప్-1ను పెద్ద స్కామ్గా వారంతా అభివర్ణిస్తున్నారు. సర్కారు మొండికి పోకుండా రిటైర్డ్ జడ్జి చేత టీజీపీఎస్సీ గ్రూప్-1 స్కామ్పై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. గ్రూప్-1 ఫలితాలపై జనార్దన్, మోతీలాల్ మరికొందరు లేవనెత్తిన అభ్యంతరాలు కింది విధంగా ఉన్నాయి.
అమెరికా నుంచి ఇలా వచ్చి, అలా పరీక్షలు రాసిన అభ్యర్థి ఏకంగా టాపర్ అయిపోయాడు. ఆ అభ్యర్థి నేరుగా అమెరికా నుంచి పరీక్షల ముందు వాలిపోయాడట. కోచింగ్ తీసుకోలేదు. టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ కూడా చేయలేదట. కానీ గ్రూప్-1 మెయిన్స్లో 502 మార్కులొచ్చాయి. ఇతను కాంగ్రెస్ నేత దగ్గరి బంధువట. కాంగ్రెస్కు చెందిన ఓ మాజీ ఎమ్మెల్సీ కోడలు టాపర్గా నిలిచారు. సదరు అభ్యర్థి రోజుకు ఐదు గంటలే చదివారట. మిగతా వాళ్లేమో 16 గంటలకు చదివినా టాపర్లు కాలేదు. కానీ ఐదు గంటలు చదివిన ఆ అభ్యర్థి మాత్రం టాపర్ అయిపోయారు. వీరంతా కాంగ్రెస్ నేతలకు దగ్గరి బంధువులు కావడంతోనే టాపర్లుగా నిలిచారని నిరుద్యోగ జేఏసీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ అభ్యర్థులే కాకుండా మరికొందరు కాంగ్రెస్ నేతల కుటుంబసభ్యులున్నట్టు నిరుద్యోగ జేఏసీ నేతలు ఆరోపిస్తున్నారు.
గ్రూప్-1 ఉద్యోగాలపై కన్నెసిన ప్రభుత్వ పెద్దలు భారీ పథకం పన్నినట్టు సమాచారం. గ్రూప్-1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ రెండోసారి నిర్వహించినప్పుడు ఓఎమ్మార్ షీట్లు అధికంగా రావడం, బయోమెట్రిక్ హాజరు అమలు చేయలేదన్న కారణంతో అభ్యర్థులు కోర్టుకెళ్లారు. కోర్టు పరీక్షను రద్దుచేసి, మళ్లీ నిర్వహించాలని తీర్పు ఇచ్చింది. తీర్పును సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం మారగానే టీజీపీఎస్సీ వైఖరి కూడా మారింది. హైకోర్టు పరీక్షను రద్దుచేసి, మళ్లీ ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించమంటే కాంగ్రెస్ సర్కారు ఏకంగా నోటిఫికేషన్నే రద్దుచేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలుచేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను కూడా ఉపసంహరించుకున్నది. ఇలా టీజీపీఎస్సీ వైఖరిని ఉన్నఫళంగా మార్చుకోవడం వెనుక బిగ్ స్కెచ్ దాగి ఉన్నట్టు నిరుద్యోగులు అనుమానిస్తున్నారు.
కొత్త నోటిఫికేషన్లో మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. 80 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో కొందరు పెద్దలకు కావాల్సినవారు దరఖాస్తు చేసినవాళ్లున్నారట. అలాంటి వారిని ఒకే కేంద్రంలో పరీక్ష రాయించి, టాపర్లుగా నిలిపారు. ఇప్పుడు ఉద్యోగాలివ్వబోతున్నారని నిరుద్యోగ జేఏసీ నేతలు ఆరోపిస్తున్నారు. గ్రూప్-1 రద్దు వెనుక ఇంత పెద్ద కుట్రదాగి ఉందని తాము ముందే గ్రహించలేకపోయామంటున్నారు.
గ్రూప్-1 జీఆర్ఎల్లో, టాపర్ల జాబితాలో అత్యధికులు కొత్తగా 2024లో దరఖాస్తుచేసిన వారేనట. 2022లో దరఖాస్తు చేసిన వారు భూతద్దం పెట్టి వెతికినా దొరకడం లేదట. 2022లో దరఖాస్తు చేసిన వారు మూడు సార్లు ప్రిలిమ్స్ పరీక్షను రాశారు. మెయిన్స్కు కోచింగ్ కూడా తీసుకున్నారు. అయినా టాపర్లల్లో పాత వారు తక్కువగా ఉండటం, కొత్తగా దరఖాస్తు చేసిన వారి నుంచే అత్యధికులు ఉండటంపై అనుమానాలు వ్యక్తమవుతునాయి.
గ్రూప్-1 స్కామ్పై సీబీసీఐడీ చేత విచారణ జరిపించాలని నిరుద్యోగ జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. జ్యుడీషియల్ కమిషన్ వేసి విచారణ జరపాలని కోరుతున్నారు. జేఏసీ నేతలు సోమవారం ఓయూలో అంబేద్కర్ ఫొటోలు చేతపట్టుకుని నిరసనకు దిగారు. నిరుద్యోగ జేఏసీ నేత మోతీలాల్ నాయక్ మాట్లాడుతూ 75 రోజుల్లో మూల్యాంకనం చేయడం, వరుస హాల్టికెట్ నంబర్లు కలిగిన 68 మందికి ఒకే మార్కులు రావడం. ఉర్దూలో పరీక్ష రాసిన 9 మందిలో ఏడుగురికి అత్యధిక మార్కులు రావడం వెనుక ఆంత్యర్యమేమిటని ప్రశ్నించారు. స్థానికేతర అభ్యర్థులకు కుల ప్రాతిపదికన రిజర్వేషన్ ఎలా ఇస్తారని, ఎంపికైన అభ్యర్థుల ప్రిలిమ్స్, మెయిన్స్ హాల్టికెట్లను బయటపెట్టాలని ప్రభుత్వాన్ని మోతిలాల్నాయక్ డిమాండ్ చేశారు.