సూర్యాపేట : రాష్టంలో రెండో అతి పెద్ద జాతర అయిన దురాజ్పల్లి పెద్ద గట్టు జాతరను వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జాతర ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఉన్నతాధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. ఫిబ్రవరిలో జరిగే పెద్దగట్టు మహాజాతరకు 15 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎక్కువ మంది రానున్న నేపథ్యంలో జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్య రాకుండా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్కు మంత్రి సూచించారు. అదే విధంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సమస్య రాకుండా చూడాలన్నారు. మిషన్ కాకతీయ ద్వారా సరిపడా నీటిని అందించాలని, ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు.
అంటు వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టంగా పారిశుద్ధ్య నిర్వహణను చేపట్టాలని మున్సిపల్ అధికారులను కోరారు. లైటింగ్ , మరుగుదొడ్ల వంటి సౌకర్యాలు కల్పించాలని, భక్తులు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పడకూడదని చెప్పారు. ఇక ఇక్కడికి వచ్చే భక్తులు ఒక రోజు మొత్తం ఉండే సంప్రదాయం ఉండటంతో.. స్థానికు రైతులకు పంట పరిహారం అందజేసి 150 ఎకరాలు సేకరించామని మంత్రి తెలిపారు. గతంలో నీరు లేక గట్టు పరిసర భూములు బీడు భూములుగా ఉండటంతో భక్తులు అందులో బస చేసే వారని, కానీ ప్రస్తుతం కాళేశ్వరం జలాలు వస్తుండటంతో పెద్దగట్టు పరిసరాలు పంట పొలాలుగా మారిపోయాయని తెలిపారు. ఈ నేపథ్యం లో భక్తుల సౌకర్యం కోసం రైతులను ఒప్పించి 150 ఎకరాలను సేకరించడం జరిగిందన్నారు.
ఈ సమీక్ష సమావేశంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్తో పాటు పెద్ద గట్టు చైర్మన్ కోడి సైదులు యాదవ్, మున్సిపల్ చైర్మన్ పెరుమాళ అన్నపూర్ణ, గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ్, పెన్ పహాడ్ ఎంపిపి నెమ్మాది భిక్షం, చివ్వెంల వైస్ ఎంపిపి జీవన్ రెడ్డి, ఉప్పల ఆనంద్, స్థానిక కౌన్సిలర్ లక్ష్మి మకథ్ లాల్, బాషా మియా తదితరుల పాల్గొన్నారు.