వరంగల్, జూలై 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాజీపేటలోని రైల్వే లోకో పైలెట్, అసిస్టెంట్ లోకో పైలెట్ల క్రూ లింకులను విజయవాడకు తరలించాలన్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్ డిమాండ్ చేశారు. దశాబ్దాలుగా రైల్వే జంక్షన్గా ఉన్న కాజీపేట నుంచి క్రూలింక్ వ్యవస్థను మార్చాలని నిర్ణయించడం అన్యాయమన్నారు. తరలింపు ఆపేవరకు ఉద్యమం ఆపబోమని స్పష్టంచేశారు.
సోమవారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో కాజీపేట రైల్వేస్టేషన్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. కాజీపేటకు మంజూరైన వ్యాగన్ పీవోహెచ్షెడ్ పనులు వెంటనే ప్రారంభించాలని, రైల్వే ఆటో అడ్డాల డ్రైవర్లకు విధిస్తున్న టాక్స్లను శాశ్వతంగా రద్దు చేయాలని, కాజీపేట రైల్వే జంక్షన్ను రైల్వే డివిజన్గా ప్రకటించాలని డిమాండ్చేస్తూ ర్యాలీ తీశారు. ధర్నాలో పాల్గొన్న వినయభాస్కర్ మాట్లాడుతూ.. ఉత్తర, దక్షిణ భారతానికి ముఖద్వారంగా ప్రసిద్ధిగాంచిన కాజీపేట జంక్షన్ను నిర్వీర్యం చేసేందుకే క్రూలింకులను తరలిస్తున్నారని ఆరోపించారు.
రోజు లక్షల మంది ప్రయాణికులను తరలిస్తున్న రైళ్లను నడుపుతున్న లోకో పైలెట్లపై ఒత్తిడి పెంచడం తగదని హితవు పలికారు. బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి చిత్తశుద్ధి ఉంటే విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయించాలని సూచించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా, కార్మిక, కర్షక, ఉద్యోగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని మండిపడ్డారు. క్రూ లింకుల తరలింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకొనేవారకు ఉద్యమం ఆగదని హెచ్చరించారు.
శాంతియుతంగా నిరసన తెలుపుతున్న టీఆర్ఎస్ శ్రేణులపై కేంద్రం అక్రమ కేసులు బనాయిస్తున్నదని.. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరన్నారు. కాజీపేట రైల్వే జంక్షన్కు పూర్వ వైభవం తెచ్చేందుకు కలిసివచ్చే రాజీకీయ పార్టీలు, సంస్థలతో ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని స్పష్టంచేశారు. అనంతరం రైల్వేస్టేషన్ మేనజర్ బాలరాజుకు వినతిపత్రం అందజేశారు.